నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, ఏప్రిల్ 9 : ప్రధాని మోదీకి దమ్ముంటే అదానీ ఉదంతంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన కార్పొరేట్ దోస్తులకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని విమర్శించారు. ఆ డబ్బుతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయి దొరికి పోయిన ఉదంతం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి మోదీ అవినీతి గురించి మాట్లాడటం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని కమ్మర్పల్లి మండలం కోనాసముందర్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యు ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడు తూ.. కేసీఆర్ పరిపాలన, ఆయన నాయకత్వం కోసం యావత్ దేశం ఎదురు చూస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి బండా ప్రకాశ్ పాల్గొన్నారు. జుక్కల్లో నిర్వహించిన సమ్మేళనంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఆర్మూర్ మండలం అంకాపూర్లో ఎమ్మె ల్యే జీవన్రెడ్డి, నిజామాబాద్లో అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్ గుప్తా పాల్గొన్నారు.
కార్యకర్తలే మా బలగం
మోదీ సర్కారు తెలంగాణపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర, వడ్డేకొత్తపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో వారు మాట్లాడారు. బేధాభిప్రాయాలను పకన పెట్టి కలిసిపనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఓటడిగే హక్కు బీఆర్ఎస్కే
బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో జరిగిన సమ్మేళనంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. బీజేపీ నాయకుల మాటలు విని ఓటేస్తే ఎంపీలుగా గెలిచి ఐదేండ్ల అభివృద్ధిని గంగలో కలిపారని మండిపడ్డారు.
దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం
దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రం గారెడ్డి జిల్లా నందిగామలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమ్మేళనంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని సంక్షేమ పథకాలను దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమనే భావనను వ్యక్తపరుస్తున్నారని చెప్పారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, వెల్దండలో నిర్వహించిన సమ్మేళనాల్లో ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, పట్నం మహేందర్రెడ్డి, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జైపాల్ యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నల్లగొండ పట్టణంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పాల్గొన్నారు.
హ్యాట్రిక్ సాధించడమే మన లక్ష్యం
వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి హ్యాట్రిక్ సాధించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ను మరోమారు సీఎంను చేసే దిశగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశానికే రోల్ మాడల్గా నిలిచిందని అన్నారు. అవసరమైతే ఖమ్మం నగరంలో జరిగిన అభివృద్ధిని వీడియో చిత్రీకరించి ప్రజలకు చూపించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు పాల్గొన్నారు.