మెదక్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్లను అడ్డంపెట్టుకుని శిఖండి రాజకీయాలకు పాల్పడుతున్నదని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గవర్నర్లతో ఇలాంటి నీచ రాజకీయాలు చేయించడం తగదని హితవు పలికారు. గురువారం మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ. 60 కోట్లతో ఎరుకల సాధికారత పథకాన్ని ఆ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొదటిసారి ఎరుకల సామాజికవర్గ అభివృద్ధికి సొసైటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆ సామాజిక వర్గం నుంచి అప్పుడెప్పుడో కుర్రా సత్యనారాయణ గెలిచారని, తర్వాత మరెప్పుడూ వారికి పదవులు రాలేదని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్.. ఆ సామాజికవర్గం నుంచి సత్యనారాయణకు, విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి దాసోజు శ్రవణ్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. వీరిని కూడా గవర్నర్ తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ భ్రష్టు పట్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణ, ఎరుకుల సామాజికవర్గాలు బీజేపీకి గుణపాఠం చెప్పాలని మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు.
గత 50 ఏండ్లలో కాంగ్రెస్ ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎరుకుల సామాజిక వర్గానికి పదవులు ఇచ్చిందా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆ అవకాశం ఇస్తే ఎందుకు తిరస్కరించారని, తమది ఏమైనా నిషేధిత పార్టీనా? అని గవర్నర్ను నిలదీశారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని, ఆ రాష్ర్టానికి ఒక నీతి, తెలంగాణకు మరో నీతా? అని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు పందులను, మేకలను బ్యాన్ చేస్తే.. చివరకు అందరు కలిసి ఆయనను బ్యాన్ చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఇప్పటికే ఎరుకల ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకున్నామని వివరించారు. ఇంకా రూ.కోటిన్నర కావాలని ఎరుకల సంఘం సభ్యులు కోరగా తప్పకుండా ఇస్తానని హామీనిచ్చానని తెలిపారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలో ఎరుకుల ఆత్మగౌరవ భవనాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. గిరిజనులకు పోడు భూములు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. ఈసారి బడ్జెట్లో ఎరుకల సాధికారతకు రూ.60 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. దీనిని రూ.100 కోట్లకు పెంచేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి సత్యవతి తెలిపారు.