మహబూబ్నగర్ జిల్లా కేటీదొడ్డి మండలంలో రాలిన మామిడిని చూపుతున్న రైతు
మెదక్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ)/ బాన్సువాడ రూరల్: అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా నష్టపోయిన పంటలను బుధవారం పలువురు ప్రజాప్రతిధులు పరిశీలించారు. రైతులకు మనోధైర్యం కల్పించారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్, కొయ్యగుట్ట, మొగులాన్పల్లి తండాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులను ఓదార్చారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో సంయుక్తంగా సర్వే చేసి, పంట నష్టంపై ప్రాథమిక అంచనాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని సూచించారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నియోజకవర్గంలోని హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లి, పాపన్నపేట మండలం లక్ష్మీనగర్, రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఓదార్చారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ నవీన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వివరాలు సేకరిస్తున్నారని, రైతులు అధైర్య పడొద్దని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి ఎకరాకు రూ.20 వేల చొప్పున ఇప్పించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు కృషి చేయాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు.