రుద్రంగి, మార్చి 2: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో సాగునీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రుద్రంగి పంప్హౌస్ వద్ద పూజలు చేశారే తప్ప మండలంలో ఏ ఒక్క చెరువును కూడా నింపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో సాగు నీరిస్తామని చెప్పి, మార్చి ప్రారంభమైనా నీళ్లు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.
పంటలు ఎండుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నిలదీశారు. సోమవారం రుద్రంగి మండల కేంద్రంలో సాగునీటి కొరతతో ఎండిన పంట పొలాలను, రుద్రంగి వేంకటేశ్వరస్వామి గండి వద్ద ఉన్న పంప్హౌస్, కాలువలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ తీరుపై ధ్వజమెత్తారు. ప్రజాపాలన అంటే రైతులు, ప్రజలను గోస పెట్టడమేనా? అని ప్రశ్నించారు.
వర్షాభావ పరిస్థితులతో రుద్రంగిలో బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయని, నీళ్లు లేక పొట్టదశలో ఉన్న పొలాలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసవిలోనూ గోదావరి జలాలు తరలివచ్చాయని, రుద్రంగిలోని నాగారం చెరువు, కలిగోట సూరమ్మ చెరువు, అచ్చయకుంట, బతుకమ్మ కుంటలు మత్తడి దుంకిన విషయాన్ని గుర్తుచేశారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు తీసుకువచ్చి చెరువులు నింపి పంటలు కాపాడాలని కోరారు.