హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మహిళలకు గ్యాస్ సిలిండర్ ధరల పెంపును కానుక ఇచ్చారని ఎద్దేవా చేశారు. మహిళా దినోత్సవం రోజున (మార్చి 8) మహిళలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. బుధవారం ఆయన రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆయా రాష్ర్టాల్లో ఎన్నికలు ముగియగానే ప్రతిసారీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తాజాగా కేంద్రం గృహ అవసరాల సిలిండర్ ధరను రూ.50, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.350 చొప్పున పెంచిందని మండిపడ్డారు. గ్యాస్ ధరల పెంపుదలకు వ్యతిరేకంగా శుక్రవారం ఎకడికకడ వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళా దినోత్సవం రోజున సైతం నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,155కు చేరుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిలిండర్ ధరల పెంపు ప్రజల నడ్డి విరిస్తున్నదని, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉన్నదని చెప్పారు. ధరలు పెరగడంతో ప్రజల కష్టాలు మరింత తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
కేంద్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను పెంచుతున్న తీరును స్థానికంగా మీడియా ద్వారా ప్రజలకు చేరేలా చూడాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఒకవైపు ఉజ్వల సీం పేరుతో మాయమాటలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం భారీగా గ్యాస్ ధరలను పెంచుతున్నదని, వారిని సిలిండర్కు దూరం చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉజ్వల సీంలో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా లబ్ధి పొందిన తొలి మహిళ సైతం ఇప్పుడు సిలిండర్ను కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారని తెలిపారు. కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
మోదీ ఇచ్చే గౌరవం ఇదేనా ?
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు గ్యాస్ ధర పెంచి సామాన్యుల నడ్డి విరిచింది. గ్యాస్ సిలిండర్ ధర పెంచడం ద్వారా మోదీ ప్రపంచ మహిళా దినోత్సవం కానుకగా బహుమతి ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తగ్గుతుంటే మోదీ సర్కారు మాత్రం సిలిండర్ ధరను పెంచింది. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే గ్యాస్ ధరను రూ.50 పెంచడం అత్యంత దారుణం. 2014లో రూ.410 ఉన్న సిలిండర్.. ప్రస్తుతం రూ.1,155కు చేరుకొన్నది. 8 ఏండ్లలో దాదాపు 745 రూపాయలు పెంచిన ఘనత బీజేపీ సర్కారుదే.
– బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్