BRS | రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న దాడులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తాను కోరారు. ఈ మేరకు మంగళవారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. హుజూర్నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను, జరిగిన హత్యలను డీజీపీ దృష్టికి బీఆర్ఎస్ నాయకుల బృందం తీసుకెళ్లింది. నిన్న మంత్రి కోమటి రెడ్డి సమక్షంలో భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు జరిపిన దాడిని కూడా డీజీపీకి వివరించారు.
పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తక్షణమే అడ్డుకోవాలని డీజీపీని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. డీజీపీని కలిసిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, కోరుకంటి చందర్, భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ దీపిక, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, రాకేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.