హైదరాబాద్, మార్చి25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగ సేవలను మరింత మెరుగుపరచాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ) రద్దు బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లును వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. వైద్యవసతులను మెరుగుపరిచేందుకు, వైద్యసిబ్బందికి సకాలంలో వేతనాలను చెల్లించే నేపథ్యంలో టీవీవీపీని రద్దు చేసి, ప్రభుత్వం ఆధీనంలో తీసుకున్నట్టుగా వెల్లడించారు. అనంతరం బిల్లుపై సభలో చర్చ కొనసాగింది. చర్చలో బీఆర్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పలు డిమాండ్లను ముందుపెట్టారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీవీవీపీ రద్దు బిల్లును బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్వాగతించారు. అదే సమయంలో పలు ప్రశ్నలను లేవనెత్తారు. కాంగ్రెస్ మాన్యిఫెస్టోలో పొందుపరిచినట్టుగా ఆశావర్కర్లకు 18వేల జీతం ఎప్పుడు పెంచుతారని? ప్రశ్నించారు. ప్రభుత్వం కేసీఆర్ కిట్ను రద్దు చేసిందని, ఫలితంగా ప్రస్తుతం సర్కారు దవాఖానల్లో డెలివరీలు 20శాతం తగ్గిపోయాయని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ లాంటి పథకాన్ని, లేదంటే అదేతరహాలో మరో పథకాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. సిద్దిపేటలో మెడికల్ టీచింగ్ కాలేజీ పనులు బీఆర్ఎస్ హయాంలో 90శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10శాతం పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని హరీశ్రావు తెలిపారు. నర్సింగ్ కాలేజీదీ అదే పరిస్థితిని వివరించారు. మెడికోల ఉపకారవేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.
శ్రీశైలం హైవేపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, బాధితులకు సత్వరం వైద్యసేవలను అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో రంగారెడ్డి జిల్లాకు కందుకూరు వద్ద వైద్యశాలను మంజూరు చేసిందని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ వైద్యశాలను ఎల్బీనగర్కు తరలించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదనే సమాచారమున్నదని తెలిపారు. వైద్యశాలను యథావిధిగా అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
టీవీవీపీ బిల్లును కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ స్వాగతించారు. వైద్యసిబ్బంది వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో టీవీపీపీ రద్దు పేరిట వైద్యసేవలను కేంద్రీకృతం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. రియల్ డేటా ఆధారంగా వైద్యసేవలు అందించాలని, ఖాళీలను భర్తీ చేయాలని, వైద్యవసతులను కల్పించాలని సంజయ్ డిమాండ్ చేశారు.

మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ మెరుగైన వైద్యసేవల కోసమే బిల్లును తీసుకొచ్చామని వివరించారు. బీఆర్ఎస్తోపాటు, బీజేపీ, ఇతర సభ్యులు లేవనెత్తిన అంశాలను పరిగణలో కి తీసుకుంటామని చెప్పారు. అనంతరం బిల్లును ఆమోదించింది.