Komatireddy Venkat Reddy | బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై మరోసారి ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని బీఆర్ఎస్ నేతలు ఈడిగ ఆంజనేయ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మెప్పు పొందడం కోసమే కేసీఆర్పై కోమటిరెడ్డి కారు కూతలు కూస్తున్నారని ఈడిగ అంజనేయ గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఈడిగ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మంత్రులు చాలా దుర్మార్గంగా, అసభ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రులు మూర్ఖులుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి, పాలమూరు జిల్లాకు ఏం చేస్తామో చెప్పకుండా కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను తిట్టకుంటే మంత్రులుగా మిమ్మల్ని ప్రజలు గుర్తించడం లేదనుకుంటున్నారా అని మండిపడ్డారు. కోట్లు వేసుకుని వికృతంగా మాట్లాడితే గౌరవం రాదని హితవు పలికారు. కోమటిరెడ్డిని కారు కూతల రెడ్డి అంటూ అభివర్ణించారు. ఇలాగే బూతులు మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
పదవుల కోసం రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర చేరాడు:. గెల్లు
మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అంటేనే ఒంటిపై చీమలు పాకినట్టు ప్రవర్తించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి భజన చేస్తున్నాడని
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గతంలో ఏం మాట్లాడిండో మర్చిపోయినట్టుగా ఉన్నాడని అన్నారు. ఇప్పుడు పదవుల కోసం రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర చేరాడని గెల్లు ఆరోపించారు. కోమటిరెడ్డి సోదరులకు పార్టీ మీద గౌరవం ఉండదని, గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి కోసం కోమటిరెడ్డి ప్రచారం చేసిండనే విషయాన్ని గెల్లు గుర్తు చేశారు. మణిక్కం ఠాకూర్ బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడతారని, లీగల్ నోటీసులు ఇచ్చారని, వాస్తవంగా ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి పై ఎందుకు కేసులు పెట్టడని ఆయన నిలదీశారు. పదేళ్ల కేసీఆర్ పాలనపై పోస్టుమార్టం చేసుకుంటా పోతే వచ్చేది ఏం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఓసీలకు పోస్టులు పెంచారని, బీసీలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళలకు పోస్టులు లేకుండా పోయాయని, సవరించి మళ్లీ గ్రూప్ -1 నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.