దేశాన్ని 65 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు రూ.57 వేల కోట్ల అప్పులు చేస్తే.. తొమ్మిదిన్నరేండ్లలోనే మోదీ ప్రభుత్వం వంద లక్షల కో ట్లు అప్పులు చేసి దేశాన్ని అప్పుల కూపంలోకి తోసివేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. దేశ అభివృద్ధిలోమీ పాత్ర ఏమిటని నిలదీశారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ధనికులకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేశారని దుయ్యబట్టారు. అదానీ కుంభకోణాల వెనుక ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉన్నదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని వివరించారు. మళ్లీ అధికారంలోకి రావడానికి మోదీ మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
రాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ మాటాలు చూస్తుంటే.. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్టుగా ఉన్నదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను నెలల తరబడి గవర్నర్ ఆమోదించకుండా మీరే ఆపి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై నిందలేయడం తగునా? అని ప్రశ్నించారు. ఇలాంటి జిమ్మిక్కులను తెలంగాణ ప్రజలు విశ్వసించరని, మోదీ పార్టీకి చెంప ఛెల్లుమనిపిస్తారని హెచ్చరించారు. మోదీకి తెలంగాణపై మొదటి నుంచీ ద్వేషమేనని, దేశానికే బాట చూపుతుంటే ఆయనకు కండ్లు మండుతున్నాయని మండిపడ్డారు.
ఓటమి భయంతోనే ప్రధాని మోదీ తెలంగాణకు ఏ హామీ ఇవ్వలేదని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక అసత్య ఆరోపణలు చేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో వరాల జల్లు కురిపించిన మోదీ తెలంగాణకు ఎందుకు హామీలు ఇవ్వలేదని ప్ర శ్నించారు. ఎన్ని రకాలుగా సర్కస్ ఫీట్లు వేసినా అధికారంలోకి రాలేమని తెలుసుకున్న మోదీ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్ర స్తావించకుండా రాజకీయ విమర్శలకే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. బీజేపీ పతనం మొదలైందని మోదీ ప్రసంగాన్ని చూస్తే స్పష్టంగా తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో తెలంగాణ అభివృద్ధిని కీర్తిస్తూ అవార్డులు ఇస్తున్నారని, రాష్ర్టానికి వచ్చినప్పుడేమో విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ సర్కారు రెండు నాల్కల ధోరణిని అవలంబించడం తగదని హితవు పలికారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అభివృద్ధి జరగపోతే, కేంద్రం అవార్డులు ఎందుకిచ్చిందని ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణ గ్రామ పంచాయతీలకు అత్యధిక అవార్డులు ఇచ్చిన విషయం మోదీకి తెలియదా? అని నిలదీశారు. తెలంగాణలో జిల్లాకో నవోదయ విద్యాలయం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కొన్ని ట్రైలర్లు ట్రైలర్స్కే పరిమితం అవుతాయని, సినిమాలు మాత్రం విడుదల కావని, బీజేపీ ట్రైలర్ కూడా అలాంటిదేనని ఎద్దేవా చేశారు.
అనేక రంగాల్లో రాష్ట్రం నం బర్వన్ స్థానంలో ఉన్నదని, తొమ్మిదేం డ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ప్రధాని మోదీకి కనిపించడం లేదా? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, హైదరాబాద్ జిల్లా పార్టీ ఇంచార్జి దాసోజు శ్రవణ్ నిలదీశారు. వరి ఉత్పత్తిలో, కరెంట్ వినియోగంలో, ఐటీ రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తుంటే.. ప్రధాని మోదీకి కండ్లు కనిపిస్తలేవా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం 40 శాతం అవినీతికి పాల్పడుతున్నదని ప్రజలు గద్దె దించారని గుర్తుంచేశారు. అది చూసిన ప్రధాని మోదీ.. ప్రతిపక్ష పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాలు అవినీతికి పాల్పడుతున్నాయా..? తెలంగాణ ప్రభుత్వం పాల్పడుతుందా..? అనేది దేశ ప్రజలకు తెలుసునని, ప్రధాని మోదీ మాట్లాడడానికి కాస్త ఇంగితం ఉండాలని హితవు పలికారు. ఉద్యోగాల కామన్ రిక్రూట్మెంట్ బిల్లును పకన పెట్టి ఇప్పుడు వర్సిటీలో ఉద్యోగాలు భర్తీపై మోదీ చెప్పడం విడ్డూరంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.