Vinod Kumar | కరీంనగర్ : రాజకీయాల్లో గెలుపోటములు సహజమని…ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా వరమని… ప్రతిపక్షంలో ఉంటే ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుని ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజా సమస్యలపై గళమెత్తే వీలుంటుందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జరిగిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో వినోద్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణకు సాధ్యం కానీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేసిందని.. ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారెడుకాయ చేసి ఆగం చేసిందన్నారు. 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు.
గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందిన కూడా కరీంనగర్లో ఉంటూ నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉన్నానని వినోద్ కుమార్ గుర్తు చేశారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత హైదరాబాద్కే పరిమితమయ్యాడని.. ఐదేళ్లలో బండి సంజయ్ కొత్తగా ఐదు నిధులు కూడా తేలేదని.. ఈ ఐదేళ్లలో ఎన్ని ఊర్లు తిరిగాడో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే బండి సంజయ్ లోకల్.. నాన్ లోకల్ ఫీలింగ్ తెస్తున్నాడని… తాను కూడా కరీంనగర్ గడ్డపైనే పుట్టినవాడనని పేర్కొన్నారు. రాజకీయాల్లో లోకల్.. నాల్ లోకల్ అనేది ఉండదని ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చన్నారు. మరి ప్రధాని నరేంద్రమోదీది గుజరాత్ రాష్ట్రం అయితే ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ఎందుకు పోటీ చేశారని.. బీజేపీలో సుమారు 50 మంది వేర్వేరు ప్రాంతాల్లో పోటీ చేసిన వారే ఉన్నారని తెలిపారు. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలి కానీ శత్రువులుగా ఉండొద్దననారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.