Vanteru Prathap Reddy | గజ్వేల్, జూలై 16 : రైతులకు వానాకాలం పంట కోసం మల్లన్న సాగర్ జలాలను కొడకండ్ల వద్ద కూడవెళ్లి వాగులోకి వదిలి రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గజ్వేల్ మండలం కొడకండ్లలోని కొండపోచమ్మ కెనాల్ వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లను వదిలి పంట సమయానికి నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా చేస్తే రేవంత్ ప్రభుత్వం రైతుల మీద కక్ష్య సాధింపు చర్యగా నీళ్లు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మూడు రోజుల్లో నీళ్లను వదలకుంటే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులు వరి నాట్లు వేసుకునేందుకు నీళ్లు లేక వర్షాల కోసం మొగులుకు ముఖం పెట్టి చూస్తున్నారని, ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కనీసం కనికరం కూడా లేదన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టుల్లోకి నీటిని ఎత్తిపోసి కాలువల ద్వారా సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. కూడవెల్లి హాల్ది వాగులకు తక్షణమే సాగు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు పండరి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.