Satyavathi Rathod | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మోదీ, ఈడీ ఒకటేనని అన్నారు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చినంత మాత్రాన అవినీతి జరిగినట్లేనా అని ప్రశ్నించారు. ఎవరైనా ఒక వ్యక్తి మోదీకి డబ్బులు ఇచ్చామంటే ప్రధానిని అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీశారు. కవిత ఎలాంటి తప్పు చేయలేదని, ఆమె కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఈ కేసులో కవిత బాధితులరాలు మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదే అని చెప్పారు. కేసీఆర్ను తెలంగాణలో, కేజ్రీవాల్ను ఢిల్లీలో రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ కేసులో అసెంబ్లీ ఎన్నికల ముందు సాక్షిగా ఉన్న కవితను లోక్సభ ఎన్నికలకు ముందు నిందితురాలిగా మార్చడం రాజకీయ కుట్రలో భాగమే అని చెప్పారు.
ఢిల్లీలో మనీశ్ సిసోడియాను తమకు లొంగితే సీఎం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారని ఆమె గుర్తుచేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎకువ లబ్ధి పొందేందుకే బీజేపీ కవితను ఈడీ ద్వారా అరెస్టు చేయించిందని అన్నారు. కవిత ఇంట్లో జరిగిన సోదాల్లో ఏమైనా డబ్బు దొరికిందా అంటే సమాధానం లేదని చెప్పారు. ప్రభుత్వాలు పాలసీలు తేవడం, వాటిని మార్చడం సహజమని, నరేంద్రమోదీ పాలసీలు మార్చడం లేదా అని ప్రశ్నించారు. మోదీ కూడా డబ్బులు తీసుకొని పాలసీలు మారుస్తున్నారా అని నిలదీశారు. కవిత విషయంలో ఈడీ అనేక తప్పులు చేసిందని, రిమాండ్ చేయకుండానే కవితను కస్టడీకి ఇచ్చారని తెలిపారు. మద్యం పాలసీ కేసులో పసలేదని సుప్రీంకోర్టు, ఢిల్లీ కోర్టులు వాదనల సందర్భంగా వ్యాఖ్యానించాయని గుర్తుచేశారు. ఈ కేసులో కథ స్రీన్ప్లే దర్శకత్వం నరేంద్ర మోదీ అని, మద్యం కేసులో బీజేపీ నేతలు ముందు స్పందిస్తే ఈడీ తర్వాత వచ్చిందని చెప్పారు. బీజేపీ నేతలు చెప్పినట్టే ఈడీ వ్యవహరిస్తున్నదని, కవిత అరెస్టు అవుతుందని బీజేపీ నేతలకు ముందే ఎలా తెలుస్తుందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఒకటై బీఆర్ఎస్ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. కవిత పోరాట యోధురాలని, ఆమె కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయట పడుతారని చెప్పారు.
ప్రధాని మోదీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. మోదీ ఓ గల్లీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని, లికర్ కేసును బీఆర్ఎస్కు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా మోదీ తమ పార్టీపై నిందలు ఎలా వేస్తారని ప్రశ్నించారు. భ్రష్టాచార్ హటావో అంటూ మోదీ దేశాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమోత్తారు. కవిత రిమాండ్ రిపోర్ట్లో తెలంగాణ సీఎం చంద్రశేఖర్రావు కూతురు అని రాజకీయ దురుద్దేశంతో ప్రస్తావించారని తెలిపారు. ఇలా రాయడం ఏ కేసు లో ఉండదని, ఇదొకటి చాలు బీజేపీ దురుద్దేశం లోకానికి తెలియడానికి అంటూ వ్యాఖ్యానించారు. మోదీకి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని సునీత అన్నారు.