RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలో మాఫియా డాన్లు మంత్రులు అయ్యారని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్న ఆయన.. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో హైడ్రామా నడుస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
మంత్రి నివాసం నుంచి నిందితుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటకు తీసుకు రాలేక పోయారు. మాఫియా డాన్లు మంత్రులు అయ్యారు. ప్రజల జీవితాలతో వారు ఆడుకుంటున్నారు. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారింది. సామాన్యుడికో న్యాయం మంత్రులకు ఓ న్యాయమా? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ నడుచుకుంటూ వస్తే పోలీసులు కేసు పెట్టారు. మా బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ సోషల్ మీడియాలో పోస్టు పెడితే పది కేసులు పెట్టారు. మంత్రికి సంబందించిన మనిషిపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు అని ఆర్ఎస్పీ మండిపడ్డారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నల్ల బాలు, గౌతమ్ తదితరులను రోజుల తరబడి జైల్లో పెట్టారు. యూరియా కోసం అడిగిన గిరిజన రైతును మిర్యాలగూడలో రోకలి బండలు ఎక్కించారు. డెక్కన్ సిమెంట్ వారిని బెదిరించిన సీఎం సన్నిహితుడు రోహిన్ రెడ్డి, కొండా సురేఖ ఓఎస్డి సుమంత్పై ఎందుకు కేసులు నమోదు చేయలేదు? పోలీసులు కొండా సురేఖ నివాసం వద్ద ప్రేక్షకులుగా మారిపోవడం దారుణం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని నిజాలు బయట పడుతాయి. సచివాలయంలో ప్రభుత్వ పరంగా జరగాల్సిన వ్యవహారాలు ప్రైవేట్ గెస్ట్ హౌస్ల్లో జరుగుతున్నాయి. రోహిన్ రెడ్డి, సుమంత్ తుపాకులు పెట్టి ఎలా బెదిరిస్తారు? అసలు తుపాకులు వారి దగ్గరకు ఎలా వచ్చాయని అని ఆర్ఎస్పీ నిలదీశారు.
కొండా సురేఖ కూతురు మాటల్లో ప్రభుత్వ పెద్దల చీకటి దందాలు బయట పడ్డాయి. మాఫియా డాన్ల చేతికి రాష్ట్రం వెళ్లిందా ?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులతో ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టిన బానోతు రవి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయాలేదు. కమిషన్ల కోసం మంత్రులు బాహాటంగా కొట్లాడుకుంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్, వివేక్, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి.. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
తెలంగాణ భవన్ ముందట ఇంటెలిజెన్స్ పెట్టె బదులు రోహిణ్ రెడ్డి, ఫహీమ్ ఖురేషి, తిరుపతి రెడ్డి గెస్ట్ హౌస్ల దగ్గర నిఘా పెట్టొచ్చు కదా..? రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక్క భూ యాజమాని సుఖంగా లేడు. ఆర్ఆర్ టాక్స్ భాదితులు ఎక్కువయ్యారు. గురుకులాల్లో మరణ మృదంగం కొనసాగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. 108 మంది విద్యార్థులు చనిపోయారు. మధ్యాహ్న భోజన సిబ్బందికి, మిషన్ భగీరథ సిబ్బందికి జీతాలు లేవు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు పిల్లలకు భోజనం వండి పెడుతున్నారు. సీఎం అనుచరులు ఒక్కో ఏరియాను పంచుకుని వసూళ్లు సెటిల్ మెంట్లు చేస్తున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు? వారిని ప్రేక్షకులుగా మార్చారు. గ్యాంగ్ల పాలన ఎక్కువైంది. గ్యాంగ్లకు మంత్రులు నాయకులుగా మారారు. రాష్ట్రంలో గన్ కల్చర్, మాఫియా పాలన పోవాలంటే రేవంత్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయాలి. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలవకపోతే మాఫియా పాలన పెరిగిపోతుంది. ఈ రోజు కేబినెట్ సమావేశంలో మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేసి తమకు పాలన చేతకావడం లేదని తప్పుకోవాలి. మాఫియా కేబినెట్ సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచే మొదలైంది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.