RSP | కాగజ్నగర్ : తమ పోడు భూములకు పట్టాలిచ్చి, అటవీ అధికారుల దౌర్జన్యాల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ,రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి దిందా గ్రామం నుండి హైదరాబాద్కు 400 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్తున్న పోడు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం పిరికిచర్య అని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
రైతులు తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే అరెస్ట్ చేయడమేంటన్నారు. ముఖ్యమంత్రి బాధలు వినాల్సింది పోయి, న్యాయం చేయకుండా పోలీసులచే అరెస్టు చేయడం దారుణమన్నారు. రైతు డిక్లరేషన్ పేరు చెప్పి రైతులకు బేడీలు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. లగచర్లలో,గద్వాలలో రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం నేడు దిందా రైతులను అరెస్ట్ చేసిందని ధ్వజమెత్తారు.
గతంలో కేసీఆర్ పాలనలో రైతులు స్వర్ణయుగం చూసారని, రేవంత్ రెడ్డి వచ్చాక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో 550 మంది రైతులు మరణించారని గుర్తు చేశారు. వరంగల్ డిక్లరేషన్లో రైతుల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ,రాజ్యాంగం పట్టుకొని జీవించే హక్కు ఆర్టికల్ 21 గురించి మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణలో రైతులు తమ బాధలు చెప్పుకుందామంటే అరెస్ట్ చేస్తున్నారని ఆర్ఎస్పీ వాపోయారు.
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, దిందా గ్రామ బిసిలు భూముల గురించి అడిగితే మాత్రం అరెస్ట్ చేయడం, బిసిలకు మోసం చేయడం కాదా అని నిలదీశారు. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి నిరసన, ధర్నాలు చేయలేదని శాంతియుతంగా వారి సమస్యల కోసం పాదయాత్ర చేస్తే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులను విడుదల చేయాలని, వారికి పోడు భూములపై హక్కులు కల్పించి న్యాయం చేయాలన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల వెంట బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.