Revanth Reddy | కాంగ్రెస్ నేతలు సంయమనం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీని ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. అదే కాంగ్రెస్ నేతల విమర్శలకు కేటీఆర్ స్పందిస్తే తొందరపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఒక్కటంటే తాము పది అంటామని స్పష్టం చేశారు. మల్లు రవి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రావుల ఖండించారు.
మల్లు రవి తన స్థాయి మరిచి కేటీఆర్ గురించి మాట్లాడటం తగదని రావుల సూచించారు. అనేక శాఖలను మంత్రిగా సమర్థంగా నిర్వహించి తెలంగాణ అభివృద్ధిపై తన మార్క్ చూపించిన నాయకుడు కేటీఆర్ అని తెలిపారు. పాలనాపరంగా అనేక సంస్కరణలు తెచ్చిన నేత అని కొనియాడారు. టీఎస్ఐపాస్తో పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారని అన్నారు. ఐటీ రంగంలో విప్లవానికి నాంది పలికి హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటంలో మేటిగా నిలిపిన నాయకుడని అన్నారు. శశి థరూర్ లాంటి కాంగ్రెస్ నేత, ఎందరో అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలు ఎంతో మంది ప్రశంసలు అందుకున్న నాయకుడు అని అన్నారు. దావోస్ పర్యటనలకు అర్థాన్ని మార్చిన వ్యక్తి అని అన్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్ధూ, హిందీ ఇలా ప్రముఖ భాషలన్నిటిలో వాక్పటిమను ప్రదర్శించే కేటీఆర్ లాంటి నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. పెద్ద నాయకుడు కావడానికి ఇంకేం లక్షణాలు కావాలని మల్లు రవిని ప్రశ్నించారు.
బూతు భాషకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి..!
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి బీఆర్ఎస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు : శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి.@RSRBRS pic.twitter.com/XS1yX1GHGF
— BRS Party (@BRSparty) January 28, 2024
మల్లు రవి అన్పార్లమెంటరీ భాష గురించి మాట్లాడాల్సి వస్తే సీఎం రేవంత్ రెడ్డి తీరు గురించే మాట్లాడాలని రావుల సూచించారు. అన్ పార్లమెంటరీ భాషకు రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. గతంలో కూడా మల్లు రవి కాంగ్రెస్లో చాలా మంది సీఎంల దగ్గర పని చేసి ఉంటారని.. వారి ధోరణులు గమనించి ఉంటారని.. ఏ కాంగ్రెస్ సీఎం అయినా రేవంత్ లాగా సభ్య సమాజం హర్షించని బజారు భాష మాట్లాడారా అని ప్రశ్నించారు. బొంద పెట్టడం, పిసికేయడం, బిల్లా రంగా, చార్లెస్ శోభరాజ్ ల పేర్లు తీసుకోవడం సీఎం సీటులో ఉన్న వ్యక్తికి సరిపోతుందా అని అడిగారు. రేవంత్ ఎంత ఆన్ పార్లమెంటరీ భాష మాట్లాడినా కేటీఆర్ సుమతీ శతకంలోని మంచి సాహిత్యం ఉన్న తెలుగు పద్యంతో తన అభిప్రాయం చెప్పారే తప్ప రేవంత్ స్థాయికి దిగజారలేదని స్పష్టం చేశారు. రేవంత్ ఇంకా ఎన్నికల సభల్లో మాట్లాడిన మాటలనే రిపీట్ చేస్తున్నారని.. అధికారంలో ఉన్నామన్న సోయి మరచి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణకు దేశంలోనే అత్యుత్తమ పాలనా భవనాన్ని అందించిన విజనరీ నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ హయాంలో సచివాలయం జైలులా ఉండేదని మల్లు రవి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. పాలనా కేంద్రం ఎలా ఉండాలో.. జైలు ఎలా ఉండాలో కాంగ్రెస్ నేతలకు తెలియదేమో.. కేసీఆర్కు తెలుసని అన్నారు. జైళ్లను కూడా బాగా చేసింది కూడా కేసీఆరే అని స్పష్టం చేశారు. పచ్చ కామెర్ల వాళ్లకు లోకం పచ్చగా కనిపించినట్టు కాంగ్రెస్ వాళ్లకు.. కేసీఆర్ చేసిన మంచి కూడా చెడుగా చేదుగానే అనిపిస్తుందని అన్నారు. జైలుకు సచివాలయానికి తేడా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
సమైక్య పాలన నుంచి, అనేక భాధలకు కారణమైన కాంగ్రెస్ నుంచి తెలంగాణను విముక్తం చేసిన ఘనత కేసీఆర్దే అని రావుల అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వాయువులు ప్రసాదించింది కేసీఆర్ అయితే.. తెలంగాణ మొత్తాన్నే జైలుగా మార్చిన ఘనత గత కాంగ్రెస్ పాలకులదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో సచివాలయం బాగా పని చేసింది కనుకే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. కేసీఆర్ హయాంలో సమర్థులైన అధికారులుగా పేరు తెచ్చుకున్న వారిని నాడు రేవంత్ విమర్శించారని.. నేడు వారినే కీలక స్థానాల్లో నియమించారు కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన అంటేనే పైరవీలకు పెట్టింది పేరు అని రావుల విమర్శించారు. పదేళ్లు అధికారం లేక వాళ్ల కార్యకర్తలు ఆకలితో ఉన్నారని అన్నారు. సచివాలయం కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోతోంది తప్ప సామాన్య జనంతో కాదని విమర్శించారు. కేసీఆర్ కట్టిన సచివాలయం ఎలా ఉందో చూడాలని ఆసక్తి ఉన్న జనం వస్తుండటంతో సందడిగా కనిపిస్తోందని అన్నారు.
బీఆర్ఎస్ను ఫినిష్ చేయండి అని రేవంత్కు మోదీ హుకుం జారీ చేశారని సీఎం దోస్త్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంత విడమరచి చెప్పాక కాంగ్రెస్ – బీజేపీది ఫెవికాల్ బంధం కాకుండా వేరే బంధం ఎలా అవుతుందని రావుల ప్రశ్నించారు. మోదీని రేవంత్ కలిశాకే రాష్ట్రంలో పెట్టుబడులకు అదానీ ముందుకొచ్చారని తెలిపారు. ఎమ్మెల్సీలకు గవర్నర్ లైన్ క్లియర్ చేశారని పేరకొన్నారు. రేవంత్ రాహుల్ ఆదేశాల కన్నా మోదీ ఆదేశాల్నే ఎక్కువగా పాటిస్తున్నారని తెలిపారు. ఉప ఎన్నికల నుంచి కాంగ్రెస్ బీజేపీ బంధం బలంగానే కొనసాగుతోందని అన్నారు.
మల్లు రవివి సొల్లు మాటలు.. ఆధారం లేని విమర్శలని రావుల ఎద్దేవా చేశారు. ఓట్ల బదిలీయే కాదు ఎన్నికలకు ముందు అభ్యర్థుల్ని బదిలీ చేసుకున్న పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు అని విమర్శించారు. హామీల అమలు విశ్వనీయతలో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ ఎన్నో రెట్లు మెరుగు అని అన్నారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి ఇస్తామన్న తొమ్మిది గంటల కరెంటును ఇవ్వలేదని.. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని చేయలేదని.. ఇలా ఎన్నో ఎగ్గొట్టిన మీరా మాకు చెప్పేది అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి మీ నిజాయితీని చాటుకుంటే ప్రజలు హర్షిస్తారని హితవు పలికారు.