Rakesh Reddy | హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం కులగణన కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉపయోగించడం, ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 30 వరకు ఒక్కపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇదేం దిక్కుమాలిన ఆలోచన రేవంత్ రెడ్డి గారు? కుల గణన కోసం ఒక్క పూట మాత్రమే బడులు పెడుతారా? అది కూడా మూడు వారాల పాటు! మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అని సూటిగా ప్రశ్నించారు. పేద, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల పిల్లలు చదువుతారు కాబట్టి మీరు ఒక పూట బడులు కూడా మూసేస్తారా? పేదలంటే ఇంత నిర్లక్ష్యమా? అయినా టీచర్లు ఉన్నది స్కూల్లో పాఠాలు చెప్పడానికా? లేక సర్కారు పనులన్నీ చేయడానికా? లక్షల మంది నిరుద్యోగులు పనుల్లేక అల్లాడుతున్నారు. వాళ్ళతో చేయించుకోవచ్చు కదా మీ సర్వేలు? అంటూ రాకేశ్ రెడ్డి మండిపడ్డారు.
సామాజిక న్యాయం చేయడానికి తప్పనిసరిగా కులగణన జరగాలి.. కానీ, అందుకు ఇతర డిపార్ట్మెంట్లను వాడుకోవాలని సూచించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఒక్కరోజులోనే రాష్ట్రమంతా సమగ్ర కుటుంబ సర్వే చేశారని, కానీ ఈ ప్రభుత్వం బీసీల అంశాన్ని రాజకీయం చేసి కాలయాపన చేయడం కోసమే ఈ తంతు నడిపిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఏనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | నువ్వు ఎప్పుడు జైలుకు పోతావో చూస్కో.. మంత్రి పొంగులేటికి కేటీఆర్ వార్నింగ్