BRS Party | మెదక్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈడీ డౌన్ డౌన్ అంటూ, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కవిత అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవిత అక్రమ అరెస్టుపై పిటిషన్ వేస్తాం. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా కావాలనే నిన్న అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. న్యాయపరంగా పోరాడతాం అని పేర్కొన్నారు. మాకు పోరాటాలు కొత్తకాదు. మా పార్టీ పుట్టిందే ఉద్యమంలో అని స్పష్టం చేశారు. ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో కుట్రపూరితంగా కవితను అరెస్టు చేయడం జరిగింది. ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని కావాలనే కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని కవితను అక్రమంగా అరెస్టు చేశారు. ఎన్ని కుట్రలు చేసిన, ఎన్ని అరెస్టులు చేసిన ఎంతమంది ఈడీలు, మోడీలు వచ్చినా భయపడేది ఏమి లేదు అని అన్నారు. కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మెదక్, హవేళిఘన పూర్ మండలం, రామాయంపేట పట్టణం పార్టీ అధ్యక్షులు అంజ గౌడ్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, నాగరాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్, వసంత్ రాజ్, నర్వ లక్ష్మీనారాయణ గౌడ్, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, బొందుల కృష్ణ,కిష్టయ్య,చంద్రం, శ్రీహరి, బాలరాజు కిషన్, మెహన్, సాయిలు, లింగం,సతీష్ రావు, రామచంద్ర రెడ్డి, సాయ గౌడ్, యామి రెడ్డి, రమేష్ ఫుల్ సింగ్,కిరణ్ జుబేర్, చాంద్ పాషా, పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.