KTR | శాసనసభలో పరిమితుల విధింపుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా మాజీ ఎమ్మెల్యేలను శాసనసభవైపునకు రాకుండా చేసిన తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదని ఆయన గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు. గతంలో ఇదే శాసన సభలోకి ఉరితాళ్లను, ఎండిన పంటలను, నూనె దీపాలు వంటి వాటితో పాటు అనేక రకాల అంశాలను తీసుకొచ్చి నిరసన తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.
శాసన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేసి తమ వైఫల్యాలను దాచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ అన్నారు. మీడియా వద్ద కూడా శాసన సభ్యులను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళ్తే కాసేపు ఆపారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 2లక్షల మంది విద్యార్థులు బయటకొచ్చిన అంశంపై మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. తమ వైఫల్యాలను దాచిపెట్టేందుకే ప్రభుత్వం ఇవన్ని ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు.
సభలో తాము ప్రశ్నిస్తేనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయటకొచ్చి ప్రకటనలు చేశారని కేటీఆర్ అన్నారు. రైతు కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తామంటూ భట్టి చేసిన ప్రకటన అసెంబ్లీ వ్యవహరాలకు వ్యతిరేకమని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలన్న అంశాన్ని భట్టి విక్రమార్క మరిచిపోయారని విమర్శించారు. ఈ అంశాన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన భట్టి విక్రమార్క.. శాసన సభ బయట ప్రకటన చేయడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఈ ప్రకటన చేస్తే తాము అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదని.. అందుకే ఇలా బయట ప్రకటన చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్రాంతి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెబుతుందని అన్నారు. దేవుళ్లపై ఒట్లు వేసిన విషయానికే దిక్కులేదని.. అలాంటప్పుడు సంక్రాంతికి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తామంటే రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు.