Krishank | హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణపై బీజేపీకి చిన్నచూపు ఎందుకు..? మోదీకి భద్రాద్రి రామయ్య కనిపించలేదా..? అని క్రిశాంక్ నిలదీశారు. తెలంగాణ భవన్లో క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. బీజేపీలో ఓట్ల ఆకలి, ఆత్రుత కనబడుతుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, ఎన్నికల కోసమే పని చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. తెలంగాణ రూపాయి పని చేయని బీజేపీ.. ఏదో విజయం సాధించినట్లు రాజకీయ యాత్ర చేపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చలేదు. ఎన్నికల మాయలో పడ్డారు బీజేపోళ్లు. పోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడదు.. కేంద్రాన్ని నిలదీయదు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వమని చెబితే.. సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుని వచ్చారు అని క్రిశాంక్ మండిపడ్డారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల సమయంలో ప్రకటించిన మోదీ.. ఇప్పటి వరకు దానికి శంకుస్థాపన చేయలేదని క్రిశాంక్ గుర్తు చేశారు. చివరిసారిగా మోదీ గతేడాది నవంబర్ 26, 27 తేదీల్లో తెలంగాణలో పర్యటించారు. ఇంకో పది రోజుల్లో లోక్సభ ఎన్నికల కోడ్ రాబోతోందని బీజేపీ నాయకులే చెబుతున్నారు. మరి కోడ్కు ముందు ఏం శంకుస్థాపన చేస్తారో.. ఏం డ్రామాలు ఆడుతారో తెలియదు. కానీ ఈ మూడు నెలల్లో మోదీ ఏం చేశారనేది తెలంగాణ సమాజం ఆలోచించాలి. కేంద్రం చేసిందేమీ లేదు. బీజేపీకి ఒక్కరూ కూడా ఓటు వేయరు. వాళ్లకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు అని క్రిశాంక్ తెలిపారు.
గత మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా మోదీ 18 రాష్ట్రాల్లో అధికారిక కార్యక్రమాలు చేపట్టారని క్రిశాంక్ గుర్తు చేశారు. డిసెంబర్ 18న 19,150 కోట్లతో యూపీలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. డిసెంబర్ 30న అయోధ్యలో రూ. 15,700 కోట్లు, జనవరి 2న తమిళనాడులో రూ. 20 వేల కోట్లు, 3న లక్షద్వీప్లో రూ. 1150 కోట్లు, 12న మహారాష్ట్రలో రూ. 12,700 కోట్లు, 17న కేరళలో రూ. 4 వేల కోట్లు, 19న మహారాష్ట్రలో రూ. 2 వేల కోట్లు, 25న యూపీలో రూ. 19,100 కోట్లు, ఫిబ్రవరి 3న ఒడిశాలో రూ. 68 వేల కోట్లు, 4న అసోంలో రూ. 3400 కోట్లు, 6న గోవాలో రూ. 1330 కోట్లు, 11న మధ్యప్రదేశ్లో రూ. 7300 కోట్లు, 16న హర్యానాలో రూ. 9750 కోట్లు, 20న ఏపీలో ఐఐఎం, ఐఐటీ ప్రారంభించారు. ఫిబ్రవరి 20న జమ్మూలో రూ. 32 వేల కోట్లు, 22న గుజరాత్లో రూ. 47 వేల కోట్లు, 23న వారణాసిలో రూ. 13 వేల కోట్లు, మొన్న గుజరాత్ రాజ్కోట్లో రూ. 48,100 కోట్ల కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇవన్నీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరోలో ఉన్నవే.. కొత్తగా చెప్పడం లేదు. ఈ మూడు నెలల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఒక్క శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అని క్రిశాంక్ తెలిపారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభం కంటే ముందు దేశంలోని పలు రామాలయాలను మోదీ సందర్శించారని క్రిశాంక్ తెలిపారు. జనవరి 21న ధనుష్ఖోడిలో కోదండరామస్వామి ఆలయం, జనవరి 20న తమిళనాడులో రామనాథ స్వామి, రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. జనవరి 17న కేరళలోని గురువయార్ను సందర్శించారు. 16 జనవరిన ఏపీలో లేపాక్షి, వీరభద్ర ఆలయంలో, జనవరి 12న నాసిక్లో ఓ టెంపుల్ను సందర్శించారు. కానీ మన భద్రాద్రిలో ఉన్న రాముడిని దర్శనం చేసుకోలేదు మోదీ అని పేర్కొన్నారు.
బీజేపీకి, కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి. చిన్న చూపు ఉందని ఎందుకు ప్రశ్నించకూడదు. ఏదో విజయం సాధించినట్లు యాత్రలు ఎందుకు..? మన దగ్గరకు ఎన్నికలకు మాత్రమే వస్తారు. ప్రచారం తర్వాత మళ్లీ కనబడరు. ఎన్నికల కోడ్ ముందు ప్రకటనలు ఇస్తారు. కానీ శంకుస్థాపనలు చేయరు. రేపు ఏ ముఖం పెట్టుకుని అరవింద్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వ్యక్తులు ఓట్లు అడుగుతారు. భారతీయ జనతా పార్టీ బడా ఝూటా పార్టీ. కేంద్ర బడ్జెట్పై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ నాయకత్వం ప్రశ్నించింది. కేంద్రంలో బీజేపీ ఉండి చేసింది శూన్యం. కచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ముందు పెట్టబోయే అజెండా ఇదే. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయలేదు. నరేంద్ర మోదీతో పాటు బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో తెలంగాణ గళం వినబడాలంటే.. కేసీఆర్కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపాలి.. అండగా నిలవాలి అని క్రిశాంక్ పిలుపునిచ్చారు.