Harish Rao | ఆదిలాబాద్ జిల్లాలో 24 గంటలు గడవకముందే రుణభారంతో మరో రైతు రాథోడ్ గోకుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్యాంకుల వేధింపులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల చావులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉసురు ఎందుకు తీస్తున్నారని నిలదీశారు.
రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని హరీశ్రావు పేర్కొన్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. రైతులకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని తెలిపారు. వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతులు దేశానికి వెన్నెముక అని.. అలాంటి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇప్పటి వరకు 𝟒𝟎𝟐 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టాడని హరీశ్రావు విమర్శించారు. గతంలో రుణమాఫీ కాలేదని అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియజేస్తున్న రైతులను అరెస్టు చేసి, పోలీస్ యాక్ట్ (30 Act) పేరుతో జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కారని విమర్శించారు. రుణమాఫీ జరగకపోవడంతో రైతులు కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ విసిగిపోతున్నారని అన్నారు. ఉన్న భూములు కుదవ పెట్టి అప్పులు తెస్తున్నారని.. ఆ అప్పులు చెల్లించలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ అని మభ్య పెట్టి.. 500 బోనస్ అని మోసం చేసి.. పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ దురవస్థ వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు.
24 గంటలు గడవకముందే రుణభారంతో ఆదిలాబాద్లో మరో రైతు రాథోడ్ గోకుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసింది.
రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బ్యాంకుల వేధింపులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల చావులు కనిపించడం లేదా?
దేశానికి అన్నం పెట్టే రైతన్న… pic.twitter.com/dstR6Ml9Ke
— Harish Rao Thanneeru (@BRSHarish) January 19, 2025
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదన్న విషయం, కాంగ్రెస్ పాలకులు పూర్తిగా మరిచిపోయినట్లున్నారని హరీశ్రావు అన్నారు. రైతు సోదరులారా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి అని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా అందరికీ రుణమాఫీ, రైతు భరోసా, అన్ని పంటలకు 500 బోనస్ హామీలు అమలు చేసే దాకా నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.