Harish Rao | తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండి కొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుండటం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ అడ్డూ అదుపూ లేకుండా తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కులను ఏపీ తరలించుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు.
ఈ వాటర్ ఇయర్ లోనే 646 టీఎంసీలు తరలిస్తే ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ కు పట్టవా అని నిలదీశారు. సాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల ఆధీనంలో ఉందని.. వారి పర్యవేక్షణలో మాత్రమే నీటిని విడుదల చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఏపీ మాత్రం ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ తాగునీటి అవసరాలకు శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నిలువ ఉంచాల్సిన కోటాను ఏపీ తీసుకెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని మండిపడ్డారు.
శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగులు నిల్వలు లేకున్నా పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాల్వ ద్వారా ఇప్పటికే ఏపీ నీటిని తరలిస్తూ మొండిగా వ్యవహరిస్తుందని హరీశ్రావు విమర్శించారు. ప్రతి సంవత్సరం ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి నీటి వినియోగానికి కేఆర్ఎంబీ పరిధిలోని త్రిమెన్ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. కానీ ఈ ఏడాది ఇంతవరకు త్రిమెన్ కమిటీ మీటింగ్ పెట్టలేదని.. అంటే బోర్డు వ్యవహారం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. బోర్డు పై ఒత్తిడి చేయడంలో, నీటి తరలింపు చేయకుండా ఏపీని నిలువరించడంలో తద్వారా తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఏపీ దూకుడు, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వల్ల ఇప్పటికే నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఖాళీ అయిన పరిస్థితి నెలకొందని హరీశ్రావు అన్నారు.
మరోవైపు వేసవి పూర్తిగా మొదలు కాలేదు తెలంగాణ రైతులు నీళ్ళ కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని హరీశ్రావు అన్నారు. ఏపీ నీటి తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే సాగర్ ఆయకట్టుకు ప్రమాదం ఏర్పడనుందని తెలిపారు. సాగర్ లో నీటిమట్టం పడిపోతే హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య సైతం ఏర్పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఏపీ నీటి దోపిడిని అడ్డుకోవాలని, ఈమేరకు కృష్ణ బోర్డుపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.