Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. కేసీఆర్ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడటం లేదని అన్నారు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట అని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల గురించి మాట్లాడటం చేతకాదు కానీ మూసీ ప్రక్షాళన లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
పదేపదే పాలమూరు బిడ్డను అంటూ, శుష్కమైన సెంటిమెంట్ను వల్లించడమే తప్ప పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదని సీఎం రేవంత్రెడ్డిని హరీశ్రావు విమర్శించారు. నిజానికి పాలమూరు బిడ్డలు పనిమంతులు, రేవంత్కు మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కు కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు, ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ, 60 ఏండ్ల పాటు కృష్ణా జలాలు దక్కక అలమటించిందంటే అది ఎవరి పాపం అని నిలదీశారు.
బంగారం పండే నల్లరేగడి భూములుండిన పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులే అని హరీశ్రావు విమర్శించారు. తెలంగాణను కరువు కాటకాల పాలు చేసి 60 ఏండ్లు ఘోర కలిని సృష్టించింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడిగం చేసిన రేవంత్.. ఇప్పుడు బాబును నొప్పించకుండా కృష్ణాజిల్లాల గురించి మాట్లాడాలనుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్ అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం అని అన్నారు.
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ఏది పడితే అది అనగల సమర్థులు మీరు అని రేవంత్ రెడ్డిని హరీశ్రావు ఎద్దేవా చేశారు. జలయజ్ఞం ధనయజ్ఞమని మాట్లాడింది మీ నోరే కదా అని గుర్తుచేశారు. శిలాఫలకాలు వేసి, కొబ్బరి కాయలు కొట్టి మొబిలైజేషన్ అడ్వాన్సులు దండుకొని, కనీసం భూసేకరణ కూడా పూర్తి దగాకోరు చరిత్ర కాంగ్రెస్ది అని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నత్త నడక నడిచిన పనులను పరిగెత్తించి పూర్తి చేసింది బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. ఇది పాలమూరులో ఏ రైతును అడిగినా చెప్పే సత్యం అని అన్నారు. రివర్ వాటర్ పొలాలకు ఇచ్చింది రివర్స్ మైగ్రేషన్ పాలమూరులో జరిగేలా చేసింది బీఆర్ఎస్ అని చెప్పారు. ప్రాజెక్టుల పేరిట డబ్బులు దండుకోవడానికి ఈపీసీ విధానం తెచ్చి ఇష్టమున్నట్టు దోచుకుంది కాంగ్రెస్ నాయకులు అని మండిపడ్డారు. ఆనాడు తెలుగుదేశం నాయకుడిగా జలయజ్ఞం అవినీతి భాగోతాల గురించి నువ్వే మాట్లాడిన మాటలు మర్చిపోయావా అని ప్రశ్నించారు.
కల్వకుర్తి ప్రాజెక్ట్ కింద 3.07లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.42లక్షల ఎకరాలు, బీమా కింద 1.58లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 38వేల ఎకరాలు, తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్ కాల్వ కింద ఉన్న 55వేల ఎకరాలను స్థిరీకరించి, ఆర్డీఎస్ లో మొత్తం 87,500 ఎకరాలకు సాగు నీరు అందించింది బీఆర్ఎస్ కాదా అని హరీశ్రావు ప్రశ్నించారు. జూరాల జలాశయంలో కర్ణాటక ముంపు ప్రాంతాలకు పరిహారం చెల్లించి, మొదటిసారిగా జలాశయంలో 9 టీఎంసీల నీటిని నింపి, లక్ష ఎకరాలకు సాగు నీరు అందించినం.. అది మీ కండ్లకు కనబడదని అన్నారు. మిషన్ కాకతీయతో భాగంగా మహబూబ్ నగర్లో 1544 చెరువులు, నాగర్ కర్నూల్లో 2024, నారాయణ్ పేటలో 950, గద్వాల్ లో 563, వనపర్తిలో 1329 మొత్తం 6410 చెరువుల కింద 3లక్షల 22వేలు 579 ఎకరాలు స్థిరీకరించామని.. 66 చెక్ డ్యాంలు, ఐడీసీ లిఫ్ట్ ల కింద మరో 24వేల ఎకరాలు స్థిరీకరించామని తెలిపారు.
పదేండ్ల కాలంలో ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే దాదాపు 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని హరీశ్రావు తెలిపారు. పాలమూరు బిడ్డల కష్టాలు తీర్చామని.. ఈ చరిత్ర మీరు చెప్పకపోయినా, పదేండ్లు పచ్చగా పంటలు పండించుకున్న రైతులను అడిగితే చెబుతారని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్లో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేదంటే ఆ పాపం కాంగ్రెస్ దే అని తెలిపారు. ఎత్తి పోతల పథకాల్లో ఎక్కడా ఒక్క పెద్ద రిజర్వాయర్ కూడా మీరు ప్రతిపాదించలేదని అన్నారు. కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టుల్లో కలిపి కనీసం 20 టీఎంసీల నిల్వ కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. కానీ, బీఆర్ఎస్ ఒక్క పాలమూరులోనే 67టీఎంసీల నిల్వ కెపాసిటీని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయ సముద్రం ఇలా మొత్తం వందకి పైగా టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మేము కదా ఏర్పాటు చేశామని ప్రశ్నించారు.
ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు అడ్డుకోవడానికి కేసుల మీద కేసులు వేసి ఆలస్యమయ్యేటట్టు చేసింది మీ కాంగ్రెస్ నాయకులు కాదా అని హరీశ్రావు ప్రశ్నించారు. మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేసిన కేసుల వల్ల కాదా పాలమూరు రంగారెడ్డి పనులు జాప్యం జరిగిందని అన్నారు! మీరు సృష్టించిన అడ్డంకులను దాటి 80శాతం పనులు పూర్తి చేయగలిగిన నిబద్ధత తమదని చెప్పారు. మీరు ఆ కేసులు వేయకుంటే ఆ 20 శాతం కూడా పూర్తి అయిపోయేదని అన్నారు. పాలమూరుకు ఎన్నటికీ తీరని శాపం కాంగ్రెస్ పార్టీనే అని.. దత్తత తీసుకున్నానని చెప్పి దగా చేసిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు.