Harish Rao | తెలంగాణ డబ్బును రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలన గాలికి వదిలి.. గాలి మోటర్లో మంత్రులు తిరుగుతున్నారని విమర్శించారు. నిజాలు చెప్పడానికి వెళ్లి.. మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పి వచ్చారని మండిపడ్డారు. రుణమాఫీపై మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే అని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రుణమాఫీ బోగస్, రైతుబంధు బోగస్, వరికి బోనస్ బోగస్ అని విమర్శించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు గ్యారేజ్కు పోయాయని హరీశ్రావు విమర్శించారు. రోడ్ల మీదున్న వడ్ల కుప్పలే.. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. 2లక్షల ఉద్యోగాలు కల్పనపై మహారాష్ట్రలో పచ్చి అబద్దాలు చెప్పారని పేర్కొన్నారు. విద్యార్థులను వీపులు పగలకొట్టించిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్ది అని మండిపడ్డారు. 40లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారని తెలిపారు. ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ జరగాల్సి ఉందని.. పూర్తి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రేవంత్ అబద్దాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కొనసాగించారని విమర్శించారు. తెలంగాణలో మోసం చేసినట్లు మహారాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని హరీశ్రావు అన్నారు. దాదాపు ఏడాది పూర్తవుతున్న ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హమీ ఇచ్చారని.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ ఇచ్చారని తెలిపారు. ఏ హామీలు అమలు చేశారో.. ఎక్కడ చర్చిద్దామో చెప్పండని.. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. అభయహస్తంలో మొదటి హామీ మహిళకు రూ. 2500 దిక్కులేదు మొదటి హామీకి దిక్కేలేదు.. మహారాష్ట్రలో కోతలు కోస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు రూ.2500 అమలు చేశావా? అని నిలదీశారు. ఒక్కో మహిళకు రూ. 27,500 ప్రభుత్వం బాకీ ఉందని.. కానీ రేవంత్ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. మహారాష్ట్రకు వెళ్లి అన్ని అబద్దాలే ప్రచారం చేస్తున్నాడని.. మొదటి సంతకం ఏకకాలంలో రుణమాఫీ అన్నారని చెప్పారు.
రుణమాఫీపై మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 2023 రుణమాఫీ చేస్తామని మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. 42 లక్షల మందికి రూ.31 వేల కోట్ల చేస్తామని.. రూ.17వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. రుణమాఫీ చేశామని ట్విట్టర్లో ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 40 లక్షలు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. రుణమాఫీ 7 నెలలు ఆలస్యం చేసి రైతులపై వడ్డీల భారం మోపింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. బ్యాంకులు ముక్కుపిండి రైతుల నుంచి వడ్డీలు వసూలు చేశాయని.. ప్రభుత్వం ఆలస్యం చేయటంతో రైతులపై వడ్డీ భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు అబద్ధాలు కాదు తెలంగాణలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నిజాన్ని చెప్పాలని హితవుపలికారు.
రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. రైతు భరోసా ఇచ్చామని చెప్పగలరా అని హరీశ్రావు ప్రశ్నించారు. రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ఇచ్చారా.. రైతు కూలీలకు ఇచ్చిన హామీ ఇవ్వలేదని చెప్పాలన్నారు. వరి పంటకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్న వడ్లను ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు తక్కువ రేటుకు దళారులకు అమ్ముకునే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడైనా బోనస్ వస్తుందా రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇండ్లు కూలగొట్టావు కానీ ఒక్క ఇళ్లు కట్టావా అని హరీశ్రావు ప్రశ్నించారు. 11 నెలల్లో ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని మహారాష్ట్రలో చెప్పి ఉంటే నిజం ఒప్పుకోవాలని సూచించారు. ఒక్క ఇళ్లు కట్టలేదు కానీ.. వందల ఇండ్లు కూలగొట్టానని చెప్పాల్సి ఉండే అని విమర్శించారు. ఒక్కరికైనా 5 లక్షల భరోసా కార్డు ఇచ్చావా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఫీజు రియింబర్స్ మెంట్ బంద్ పెట్టిన ఘనత రేవంత్ ది అని అన్నారు. . నేడు విద్యార్థులను, నిరుద్యోగులను రోడ్డు మీదికి తెచ్చావని అన్నారు. రూ.4000 ఫించన్ ఇస్తానని వృద్ధులను మోసం చేశారు.. ఒక్కొక్కరికి రూ. 26 వేల పెన్షన్ కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందని అన్నారు. 41 లక్షల మంది పెన్షన్ దారులకు ప్రభుత్వం బాకీ పడిందని.. ఇవన్ని అమలు చేయలేదని రేవంత్ చెబితే బాగుండేదని అన్నారు.10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పి, కేసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు మహారాష్ట్రలో చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశానని మహారాష్ట్ర ప్రజలకు నిజం చెప్పాలని సూచించారు. నోటిఫికేషన్ ఇచ్చింది లేదు.. ఎగ్జామ్ పెట్టింది లేదు మరి ఎలా 50,000 ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. అశోక్ నగర్ లైబ్రరీలో నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయించిన ఘనత రేవంత్ రెడ్డిది అని విమర్శించారు. అర్థరాత్రి ఆడపిల్లల్ని అరెస్ట్ చేయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని హరీశ్రావు విమర్శించారు. ఉద్యోగాల భర్తీలో వైఫల్యంపై మహారాష్ట్రలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. జీవో 29 పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ప్రశ్నించిన నిరుద్యోగులపై పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేశారని విమర్శించారు.