Harish Rao | యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని హరీశ్రావు తెలిపారు. కానీ కాంగ్రెస్ వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. యథా రాజ తథా ప్రజా అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో దాడులు చేస్తే, ఆ పార్టీకి చెందిన నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన అని ప్రశ్నించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన… pic.twitter.com/2ulQI5VNfZ
— Harish Rao Thanneeru (@BRSHarish) January 11, 2025
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాగే దాడులు జరిగి ఉంటే మీకు అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితులు ఉండేవా అని కాంగ్రెస్ నాయకులపై హరీశ్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీపైన గోబెల్స్ ప్రచారం చేసే అవకాశం ఉండేదా అని నిలదీశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో, ఏడాది కాంగ్రెస్ పాలనలో అశాంతి, అలజడి నెలకొన్నదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని.. తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.