Harish Rao | కాంగ్రెస్ ఏడాది పాలనలో నిరుద్యోగుల బాధలు చెప్పాలంటే.. రాస్తే రామాయణమంత, చెప్తే భారతమంత అని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరుతో బీఆర్ఎస్ ఛార్జిషీట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల రెక్కల కష్టంతో రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని తెలిపారు. అవసరం తీరాక నిర్దాక్షిణ్యంగా నిరుద్యోగుల రెక్కలు విరిచారు, డొక్కల్లో గుద్దారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలిచ్చి, ఇదంతా తన ఘనతే అని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నడు సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్రావు మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ అని, జాదూ క్యాలెండర్ ప్రకటించాడని విమర్శించారు. జాబ్ లెస్ క్యాలెండర్ చూసి నిరుద్యోగులు నివ్వెరపోయారని తెలిపారు. రాజుగారి దేవతా వస్త్రాల వలె ఆ క్యాలండర్లో ఉన్న ఉద్యోగాలు కాంగ్రెసోళ్లకు తప్ప మరెవరికీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ప్రతినెల 4,000 భృతి అని ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయని విమర్శించారు. డీఎస్సీ, గ్రూప్ – 2 వాయిదా వేయమంటే నిరుద్యోగుల మీద లాఠీలు ప్రయోగించిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతీ నిలయమైన చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ ప్రాంతాలు, నిరుద్యోగుల ఆక్రందనలతో దద్దరిల్లినయని తెలిపారు. జీవో 29 రద్దు చేయమన్నందుకు వీపు విమానం మోత మోగించిండని.. నిరుద్యోగుల కళ్లల్లో దుమ్ము కొట్టిండని మండిపడ్డారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో గురుకుల విద్య గొప్పగా వర్ధిల్లిందని హరీశ్రావు తెలిపారు. గురుకులాల సంఖ్యను 298 నుంచి 1022 కు కేసీఆర్ పెంచారని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల పిల్లలకు అద్భుతమైన విద్య అందించిండని చెప్పారు. గతంలో పురుగులన్నం పెట్టిన హాస్టళ్లలో, సన్నబియ్యంతో చక్కని బువ్వ పెట్టిండని అన్నారు. కానీ రేవంత్ సీఎం అయిన నాటి నుంచి గురుకులాలకు గ్రహణం పట్టిందని అన్నారు. పురుగుల అన్నం, గొడ్డుకారం పెడుతున్నారని ఆడపిల్లలు సైతం రోడ్డెక్కారని గుర్తుచేశారు. పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, విద్యుత్ షాకులతో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడిలో ఆనందంగా పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు.. ఆసుపత్రుల్లో కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యా శాఖల పరిస్థితి ఇంత దారుణంగా ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా రేవంత్ సాధించిన రికార్డు ఏమిటంటే.. తన నేరపూరిత నిర్లక్ష్యంతో 49 మంది గురుకుల విద్యార్థులను బలితీసుకున్నడాని.. ఎంతో మంది తల్లిదండ్రులకు తీరని గుండెకోత మిగిలించిండని అన్నారు.
ఎన్నికల సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులను తమ వైపు తిప్పుకోవడం కోసం ఇష్టానుసారం రేవంత్ రెడ్డి హామీలు గుప్పించారని హరీశ్రావు అన్నారు. అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను తక్షణం విడుదల చేస్తామని నమ్మబలికారని తెలిపారు. 5 డీఏలకు గాను ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోండి అన్నాడని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫార్సులను అమలు చేస్తమని మేనిఫెస్టోలో చెప్పారన్నారు. ఏడాది గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని విమర్శించారు. చివరకు పీఆర్సీ అనే మాట ఉచ్చరించడానికి కూడా ఉద్యోగ సంఘాలు సాహసించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. పోలీసుల సరెండర్ లీవ్, టీఏ బిల్లుల కోసం పోరాటమే చేయాల్సి వస్తున్నదని చెప్పారు. 7వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెన్ఫిట్స్ ఎగవెట్టి, ఏడాది పాలన విజయోత్సవాలు చేసుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని అన్నారు. ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్ వాడీలు, హోం గార్డులకు ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని తెలిపారు..