Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారని విమర్శించారు. సింగరేణి సంస్థ గడించిన లాభాల ఆధారంగా కార్మికులకు ఇచ్చే బోనస్ను కూడా బోగస్ చేశారని మండిపడ్డారు.
సింగరేణి లాభాల వాటాలో 50 శాతం కోత విధిస్తూ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. ఎంతో శ్రమించి సంస్థకు డబుల్ ప్రాఫిట్ చూపించినందుకు డబుల్ వాటా వస్తుందన్న కార్మికుల ఆశలను అడియాశలు చేసిందని విమర్శించారు. 2022-23 గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలు రూ.2222 కోట్లు అయితే దీనిలో 32 శాతం అనగా దాదాపు రూ.710 కోట్ల రూపాయలు కార్మికులకు అందించామని గుర్తుచేశారు. 2023-24కు వచ్చిన లాభాలు రూ.4701 కోట్ల రూపాయలు కాగా ప్రభుత్వం చెప్పిన విధంగా 33 శాతం లాభాలు పంచితే మొత్తంగా దాదాపు రూ.1550 కోట్ల రూపాయలు కార్మికులకు రావాల్సి ఉందని తెలిపారు. కానీ కార్మికులకు ప్రకటించింది కేవలం రూ.796 కోట్లు. అంటే ఇది 16.9 శాతం మాత్రమేనని.. కార్మికులకు హక్కుగా రావాల్సిన మిగతా వాటా 754 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.
లాభాలేమో రూ.4,701 కోట్లు చూపించి, కేవలం రూ.2,412 కోట్లలో 33 శాతం బోనస్ను ప్రకటించడం ఏమిటని హరీశ్రావు ప్రశ్నించారు. మిగతా రూ.2,289 కోట్లకు బోనస్ను ఎగ్గొట్టడం ఏమిటని నిలదీశారు. ఆల్టైం రికార్డు ఉత్పత్తిని సాధించినా గతం కంటే ఒక్కో కార్మికుడికి అదనంగా ఇచ్చేది రూ.20 వేలేనా? కార్మికులు చేసిన కష్టానికి, ఫలితం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు.
కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోయిందని హరీశ్రావు గుర్తుచేశారు. నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను లాభాల బాటలో పట్టించారని తెలిపారు. కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ వచ్చారని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో 2008-09 నుంచి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 16 శాతమే అని తెలిపారు.
స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఎంతో ఉదారతతో వ్యవహరించారని హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరం (2014-15)లోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 21 శాతం వాటాను ప్రకటించారని గుర్తుచేశారు. 2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించి కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందరికీ వెలుగు అందించే కార్మికుల జీవితాల్లో చీకటి నింపే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. ఘనంగా చెప్పుకున్న కాంట్రాక్ట్ కార్మికులకు వాటా విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. ఉద్యోగుల సంఖ్యను కుదించి 5 వేల బోనస్ కొందరికే పరిమితం చేయడం మరో మోసమని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా కార్మికులకు చెల్లించినట్లుగానే లాభాల్లో వాటా చెల్లించాలని, మొత్తం 4701 కోట్లలో 33% బోనస్గా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని హరీశ్రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.