Harish Rao | మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.
పచ్చని పొలాల్లో ఫార్మా సిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా అని హరీశ్రావు నిలదీశారు. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరని అన్నారు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతామని హెచ్చరించారు. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం అధికారులపై దాడి ఘటనపై ఆ అర్ధరాత్రి నుంచే పోలీస్ యాక్షన్ షురూ అయింది. అర్ధరాత్రి వేళ.. కరెంట్ సరఫరా నిలిపేసి.. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ.. ఇల్లిల్లూ సోదాలు చేసి.. సుమారు 300 మంది పోలీసులు 55 మందిని పట్టుకొని బంధించారు. పోలీస్స్టేషన్కు తరలించారు. విచారణ అనంతరం 16 మంది రైతులకు కోర్టుకు రిమాండ్ చేశారు. వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వగా, పరిగి సబ్ జై లుకు తరలించారు. అలాగే బుధవారం ఉదయం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్దకు వాకింగ్కు వచ్చిన పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. కాగా, నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ భగ్గుమంది. కొడంగల్ నియోజకవర్గవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చింది.