Delhi Elections | ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మాత్రమే మిగిలిందని విమర్శించారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర అమోఘమని వ్యంగ్యంగా అన్నారు.
తెలంగాణలో హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా అని రాహుల్, రేవంత్ రెడ్డిని హరీశ్రావు ప్రశ్నించారు. మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన మీకు బెడిసికొట్టిందని పేర్కొన్నారు.
ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణనను మళ్లీ నిర్వహించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోండి రేవంత్ రెడ్డి గారూ అని హితవు పలికారు. లేదంటే మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఎద్దేవా చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు గుండు సున్నానే మిగిలింది. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అసలు ఖాతానే తెరవలేదు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.