Harish Rao ఎమ్మెల్సీ కవిత అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా.. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు ఉండటంతో కావాలనే శుక్రవారం అరెస్టు చేశారని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో తమపై బురద జల్లాలని.. రాజకీయంగా తమను దెబ్బతీయాలనే ఒక పథకం ప్రకారం కుట్రతో కవితను బీజేపీ అరెస్టు చేయించిందని విమర్శించారు. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఈ అరెస్టుపై ఇప్పటికే కేంద్రమంత్రి సహా బీజేపీ నాయకులు చాలా సార్లు ప్రకటనలు చేశారని హరీశ్రావు గుర్తు చేశారు. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు ఈడీ అధికారులలా వ్యవహరిస్తూ కవితను అరెస్టు చేస్తామని.. గత సంవత్సరన్నర కాలంగా ప్రకటనలు చేశారని తెలిపారు. రేపు పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని.. ఈసీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ కవితను అరెస్టు చేయడం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నమని ఆరోపించారు. తమను డీమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయని అన్నారు.
బీఆర్ఎస్ ఉద్యమాల పార్టీ అని హరీశ్రావు తెలిపారు. తమకు అరెస్టులు, వేధింపులు, కుట్రలు కొత్తేమీ కాదని అన్నారు. ఇలాంటి ఎన్నో కుట్రలు, అక్రమ కేసులు, అరెస్టులను చేధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ తమదని స్పష్టం చేశారు. 14 ఏండ్లు పోరాడి.. రానే రాదు అన్న రాష్ట్రాన్ని సాధించిన పార్టీ తమ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. ఈ కుట్రను రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు. దీనిపై న్యాయవాదులతో సంప్రదించి అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టులో వెంటనే పిటిషన్ వేసి.. న్యాయపరంగా పోరాడతామని చెప్పారు.
ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టులో ఈడీనే స్వయంగా చెప్పిందని గుర్తు చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో చెప్పిన మాటకు విరుద్ధంగా ఒక మహిళను శుక్రవారం నాడు సాయంత్రం 6.30 గంటల తర్వాత అరెస్టు చేయడమంటే.. ఇది కచ్చితంగా రాజకీయ కుట్రనే అని తెలిపారు. రేపు నోటిఫికేషన్ వస్తుందనగా.. ఇవాళ అరెస్టు చేయడమంటే.. తమ పార్టీని దెబ్బతీసేందుకు చేసిన కుట్ర అని మండిపడ్డారు. ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఈడీకి అంత తొందర ఎందుకు అని హరీశ్రావు ప్రశ్నించారు. మహిళలను ఈడీ అరెస్టు చేయవచ్చా? చేయరాదా? అనే దానిపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కుటుంబసభ్యురాలిపైనా, నళిని చిదంబరంపైనా, కవితపైనా ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని తెలిపారు. మూడు రోజుల తర్వాత ఈ కేసు విచారణకు వస్తుండగా.. అంత తొందరగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో తమను దెబ్బతీయాలనే కుట్రనే ఇది అని రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. ఒక ఎమర్జెన్సీని మించిన పరిస్థితి ఇవాళ కనిపించిందని అన్నారు.
దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత అరెస్టు జరిగిందని హరీశ్రావు అన్నారు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయన్నారు. గతంలో తమ మంత్రులు గంగుల కమలాకర్, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని అన్నారు. అటు ఈడీ కేసులు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు.. ఇలా అనేక రకాల పార్టీ నాయకులపై కుట్రలు జరిగాయని అన్నారు. గతంలో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కూడా బీజేపీ ప్రయత్నించిందని గుర్తు చేశారు. ఇదో రకంగా రాజకీయంగా కక్ష సాధింపు చర్యలేనని అన్నారు. ఈ ప్రజాస్వామిక చర్యలకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని తమ పార్టీ పిలుపునిస్తుందని అన్నారు.
కవిత అరెస్టు రాజకీయంగా ప్రేరేపితమైనదే అని హరీశ్రావు అన్నారు. ఏడాదిన్నర కింద కవితకు విట్నెస్ కింద నోటీసులు ఇచ్చారు.. ఇవాళ అక్యూస్డ్ కింద అరెస్టు చేస్తున్నామని ఈడీ అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఈ ఏడాదిన్నరకాలంగా ఏం చేశారని ఈడీ అధికారులను నిలదీశారు. రేపు పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా.. ఇవాళ అరెస్టు చేయడమంటే.. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిందేనని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడిందని విమర్శించారు. దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. ఈ కుట్రలకు రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ, కాంగ్రెస్కు శిక్ష తప్పదని హెచ్చరించారు.