Harish Rao | హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. యూటీ చేస్తే మన హైదరాబాద్ మనకు దక్కదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లేని తెలంగాణ.. తల లేని మొండెంలాంటిదని అభిప్రాయపడ్డారు. మధిర నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో.. ప్రశ్నించే గొంతుకనే గెలిపించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అందర్నీ మోసం చేసిందని.. ఆరు నెలల్లోనే నిజస్వరూపం బయటపడిందని హరీశ్రావు అన్నారు. ఆరు నెలలు అయినా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని అన్నారు. నిరుద్యోగ భృతి విషయంలో చేతులెత్తేశారని అన్నారు. నిరుద్యోగ భృతి గురించి అడిగితే మేం హామీనే ఇవ్వలేదని కాంగ్రెస్ అంటుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లు, కరెంట్ మాయమయ్యాయని.. కేసీఆర్ కిట్లు బంద్ అయ్యాయని హరీశ్రావు అన్నారు. ఇంకెన్ని రోజులు కేసీఆర్ను తిట్టుకుంటూ కాంగ్రెస్ నేతలు బతుకుతారని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓడిస్తేనే కాంగ్రెస్కు కనువిప్పు కలుగుతుందని అన్నారు. కాంగ్రెస్కు ఓటు వేయడం అంటే.. కాంగ్రెస్ అబద్ధాలను ఆమోదించడమే అని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీకి బీజేపీ అప్పగించిందని హరీశ్రావు గుర్తు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ను యూటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.