Gattu Ramachandra Rao | ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లే లేవని ప్రొజెక్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ నుంచి డిమాండ్ వచ్చేసరికి నీళ్లు ఎలా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నేతన్నలను పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కేవలం నాలుగు రోజుల్లోనే ఆరుగులు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి వచ్చారని, ప్రజల తీర్పును గౌరవించి తమ అధినేత పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని చెప్పారు. ఆ రోజు కేసీఆర్ తలచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది కాదన్నారు. ప్రజలు ఎన్నుకున్నవారిని ఐదేండ్లు పాలన చెయ్యనిద్దామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ‘పార్టీ ఫిరాయింపులపై చట్టం తెస్తామని రాహుల్ గాంధీ అంటుంటే.. పార్టీ మారిన వ్యక్తులను స్టేజీ పైన సీఎం రేవంత్రెడ్డి కూర్చోబెట్టాడని ఎద్దేవా చేశారు.
ఓటుకు నోటుకు కేసులో రూ.50 లక్షల ఎక్కడి నుంచి తెచ్చాడో రేవంత్రెడ్డి ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదని చెప్పారు. ఈ విషయాన్ని తేల్చకుండా ఎమ్మెల్యే కొనుగోలుకు యత్నించిన రేవంత్ రెడ్డిని ముందు జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ముందు జైలుకు వెళ్లేది రేవంత్ రెడ్డేనని జోష్యం చెప్పారు. 420 హామీలు ఇచ్చి ఒక హామీ కూడా సరిగ్గా అమలు చెయ్యడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ తుస్సుమన్నదని చెప్పారు. రాహూల్ గాంధీని పిలిపించుకుని రేవంత్రెడ్డి రెచ్చిపోయాడే తప్పా.. సభలో పస లేదన్నారు. పదేళ్లలో లేని ప్రేమ ఇవ్వాళ తెలంగాణపై రాహుల్ గాంధీకి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. మరోవైపు మోదీతో సంబంధాలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ పరువు తీశాడని అన్నారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూనే కవిత అరెస్టు సరైందేనని కాంగ్రెస్ నేతలు మాట్లాడడం.. వారి మానసిక స్థితికి అద్దం పడుతుందన్నారు.