హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లే లేవని ఇంతకాలం చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఎలా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు తమను పట్టించుకునే నాథుడు లేకపోవడంతో నేతన్నలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు రోజుల్లోనే ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి వచ్చారని, ప్రజల తీర్పును గౌరవించి తమ అధినేత పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని తెలిపారు. ఆరోజు కేసీఆర్ తలచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది కాదని చెప్పారు.
‘పార్టీ ఫిరాయింపులపై చట్టం తెస్తామని రాహుల్గాంధీ అంటుంటే, రేవంత్రెడ్డి మాత్రం పార్టీ మారిన వ్యక్తులను స్టేజీపై కూర్చోబెట్టాడని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలు ఎకడి నుంచి తెచ్చాడో రేవంత్రెడ్డి ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదని, ముందు ఆయననే జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం పదవి పోయిన తరువాత ముందు జైలుకు వెళ్లేది రేవంత్రెడ్డేనని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒకటి కూడా సరిగ్గా అమలు చెయ్యడం లేదని విమర్శించారు.
తుక్కుగూడ కాంగ్రెస్ సభ తుస్సుమన్నదని ఎద్దేవాచేశారు. రాహుల్గాంధీని పిలిపించుకుని రేవంత్రెడ్డి రెచ్చిపోయాడే తప్ప సభలో పస లేదన్నారు. రాహుల్గాంధీకి తెలంగాణపై పదేండ్లలో లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చిందో చెప్పాలని కోరారు. మరోవైపు మోదీతో సంబంధాలు పెట్టుకున్న రేవంత్రెడ్డి తమ పార్టీ నేత రాహుల్గాంధీ పరువు తీశాడని అన్నారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూనే కవిత అరెస్టు సరైందేనని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం వారి మానసిక స్థితికి అద్దం పడుతున్నదని దుయ్యబట్టారు.