హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): చెడ్డీగ్యాంగ్ తరహాలో రాష్ట్రంలో వలసల గ్యాంగ్ ఒకటి తయారైందని, అధికారం ఎక్కడుంటే వారు అక్కడి వెళ్తుంటారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. వయసులో పెద్దవారైన కేశవరావు, కడియం శ్రీహరి విలువలకు తిలోదకాలు ఇచ్చి పార్టీలు మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేకే, కడియం వెంటిలేటర్పై ఉంటే కేసీఆర్ వారికి సంజీవని ఇచ్చి బతికించారని పేర్కొన్నారు. కడియం కారణంగానే వరంగల్ జిల్లాలో అరూరి రమేశ్, టీ రాజయ్య, పసునూరి దయాకర్ పార్టీ నుంచి వెళ్లిపోయారని, ఇప్పుడు ఆయనే వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజయ్య చేతిలో ఓటమి పాలై మూలన ఉన్న కడియం శ్రీహరికి కేసీఆర్ ఒక్క సీఎం పదవి తప్ప అని రకాల పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ను తప్పుబట్టే అర్హత కావ్యకు ఎక్కడుందని ప్రశ్నించారు. విలువలనేవి లేకుండా పవర్ బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్నేళ్ల వారి అనుభవాన్ని స్వార్థం కోసం వాడుకున్నారని మండిపడ్డారు. తాము త్యాగాలు చేస్తే వారు భోగాలు అనుభవించారని పేర్కొన్నారు. ఊసరవెల్లి, పాముకంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వయసు పెరిగిన ప్రతివారు తాను మేధావిని అనుకుంటే పొరపాటేనని కడియం, కేకేను ఉద్దేశించి ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. కడియంలాంటి వారివల్ల దళిత జాతికి ఎలాంటి లాభం లేదన్న మందకృష్ణ వ్యాఖ్యలు నిజమని, ఇలాంటి వాళ్లను రాళ్లతో కొట్టినా పాపం లేదని అన్నారు. పార్టీ మారినవారిని రాళ్లతో కొట్టాలని, వారింటిముందు చావుడప్పు కొట్టాలని గతం లో వ్యాఖ్యానించిన రేవంత్రెడ్డి ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. పార్టీమారినవారు పదవులకు రాజీనామా చేయకుంటే ఇండ్లముందు చావుడప్పులు ఉంటాయని హెచ్చరించారు. తమ బిడ్డల రాజకీయ జీవితం కోసం ఇద్దరు నేతలు బుడ్డెరఖాన్లా మారారని విమర్శించారు. ఇలాంటి ద్రోహులు ఎక్కడ పోటీచేసినా ఉద్యమకారులు, నేతలు, కార్యకర్తలు వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తనకు అవకాశమిస్తే వరంగల్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతానని ఎర్రోళ్ల పేర్కొన్నారు.