Yadadri | హైదరాబాద్ : యాదాద్రిలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను గౌరవంగా ఎత్తయిన పీఠలపై కూర్చోబెట్టి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానకరంగా తక్కువ ఎత్తయిన పీఠలపై కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనం అని పేర్కొన్నారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా అవమానించడం బాధాకరం. ఇది యావత్ దళిత జాతికి జరిగిన అవమానం అని తెలిపారు. అణగారిన వర్గాలపై కాంగ్రెస్ది కపట ప్రేమ అని, ఆ పార్టీకి దళితులపై ఎలాంటి ప్రేమలేదని తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రికే జరిగిన ఈ ఘోర అవమానానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ వెంటనే స్పందించాలి. అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. బాధ్యులను అరెస్ట్ చేయాలి అని ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.