Dasoju Sravan | ప్రజాపాలన అంటే పిల్లలాటగా ఉందా? అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తానని అధికారం హస్తగతం చేసుకున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్పై అక్కసుతో ప్రజాభ్యుదయానికి సంబంధం లేకుండా ప్రభుత్వ గుర్తులను మార్చి, తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను తుడిచివేసే పనిలో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర మార్చాలని అనుకోవడం రేవంత్ రెడ్డి అవివేకానికి, మూర్ఖత్వానికి, మరగుజ్జు మనస్తత్వానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రభుత్వ గుర్తులను మార్చడం తుగ్లక్ చర్య అని దాసోజ్ శ్రవణ్ అన్నారు. ఒకవేళ రేపో మాపో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వస్తే.. ఆ తర్వాత వచ్చే ముఖ్యమంత్రి కొత్త లోగో తీసుకురావాలా? అని ప్రశ్నించారు. ఒకవేళ మార్చాల్సిన అవసరమే ఉంటే.. ముందుగా ప్రజలను ఒప్పించి మెప్పించాలని తెలిపారు. అంతేకాని.. సీఎం తన మంది మాగధుల సొంత నిర్ణయం కాకూడదని సూచించారు. అన్ని వర్గాల ప్రజల నిర్ణయం కావాలని.. కనీసం అసెంబ్లీలోనైనా చర్చ జరగాలని అన్నారు. ఏది పడితే అది చేయడానికి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి రాజు కాదు అని అని కేవలం ప్రధాన సేవకుడు మాత్రమే అని తెలిపారు. ఆ పదవి కూడా శాశ్వతం కాదని చెప్పారు.