Dasoju Sravan | పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా సీఎం రేవంత్ రెడ్డి పాలన మారిందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఆయన పాలన చాలా అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రానికి మిగులు విద్యుత్తు అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్కు సంజాయిషీ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు కేసీఆర్కు సంజాయిషీ నోటీసులా అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్తు సరఫరా చేసి, అభివృద్ధికి దారితీసినందుకు కేసీఆర్కు సంజాయిషీ నోటీసులా అని నిలదీశారు. ప్రతీకార రాజకీయాలను పక్కనబెట్టి, ప్రజాసంక్షేమం కోసం కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
గత ప్రభుత్వంలో మాదిరిగా 24 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని ప్రజలను డిమాండ్ చేస్తున్నారని దాసోజు శ్రవణ్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధిని అడ్డుకునే మీ దుష్ప్రయత్నాలను విరమించాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్రం, కరెంట్ లోటుతో సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితిని మీ ప్రతీకార రాజకీయాలతో మరింత కష్టతరం చేయడం సరికాదని హితవు పలికారు. హామీల అమలు చేతకాని గుంపు మేస్త్రీగా డివెర్షన్ పాలిటిక్స్ చేస్తూ సంజాయిషీల ప్రతీకార రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు.
రుణ మాఫీ, రైతు భరోసా, ఉద్యోగాలు, 4 వేల పెన్షన్, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళకు 2500 రూపాయలు లాంటి పథకాలు అమలు చేయడం చేతగాక.. కేసీఆర్ను బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కుయుక్తులను పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఆలోచనలు, కృషిని కేంద్రీకరించాలని సూచించారు. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను, వారి అభివృద్ధిని అణగదొక్కే ప్రయత్నాలను విరమించాలని హితవు పలికారు.