Dasoju Sravan | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రజలను దగా చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఆరు గ్యారెంటీల ఎగవేతకు ప్రభుత్వం దారులు వెతుకున్నదని ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత కోలేటి దామోదర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సచివాలయాన్ని సీఎం రేవంత్రెడ్డి గాంధీభవన్గా భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సమక్షంలో రాజకీయ ప్రసంగాలు చేయటాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ పాలనలో లబ్ధిదారుల ఎంపిక పార్టీతో సంబంధం లేకుండా జరిగిందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. సచివాలయం వేదికగా కేటీఆర్, హరీశ్రావుపై వ్యక్తిగత విమర్శలు చేయటాన్ని తప్పుబట్టారు.
తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్
కేసీఆర్ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను కొనుగోలు చేసి వాటిని విజయవాడలోనే ఉంచారని చెప్పిన సీఎం రేవంత్రెడ్డికి ఆ వాహనాలు ఇష్టంలేకపోతే అంబులెన్స్గా వాడాలని దాసోజు శ్రవణ్ సూచించారు. సర్కార్ దగ్గర లంకెబిందెలు ఉండవు. దస్తావేజులు, కాగితాలు ఉంటాయని చురకలేశారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెట్టి అభాసు పాలైందికాక ప్రధాని ముందు కూడా తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. ఓ అభాగ్యురాలిని కేటీఆర్ ఆదుకుంటే ఏడుపు ఎందుకు?’ అని ప్రశ్నించారు.
టైంపాస్కే దరఖాస్తులు
తెల్లరేషన్ కార్డులు ఉంటేనే ఆరు గ్యారెంటీలకు అర్హులని చెప్తున్న సర్కార్, తిరిగి దరఖాస్తులు చేసుకోవాలని కోరడం వెనుక కుట్ర దాగి ఉన్నదని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేదాకా దరఖాస్తుల పేరుతో టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించినపుడు షరతులు ఉంటాయని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. అవసరం తీరాక ప్రజలను మోసం చేయటం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు.
రైతుబంధు ఏది?
రైతులకు డిసెంబర్ 9న రైతుబంధు కింద రూ.15 వేలు చెల్లిస్తామని బీరాలు పలికిన సీఎం రేవంత్రెడ్డి, ఇప్పుడు ఆ ముచ్చటనే విస్మరించారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. సచివాలయాన్ని కేసీఆర్ దేశానికే తలమానికంగా నిర్మిస్తే దాన్ని దుబారా అన్న సీఎం రేవంత్రెడ్డి, ఇష్టం లేకపోతే దాన్ని బీఆర్ అంబేద్కర్ దవాఖానగా మార్చాలని దాసోజు శ్రవణ్ సూచించారు. ప్రగతిభవన్ను ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలని సూచించారు. సీఎం క్యాంప్ ఆఫీసు ఉండగా ఇప్పుడు రేవంత్రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో ఎకరం స్థలంలో కొత్తగా సీఎం క్యాంపు కార్యాలయం ఎందుకు కడుతున్నట్టు? అది దుబారా కాదా? అని పశ్నించారు.
పైసలు లేనప్పుడు యాడ్స్ ఎందుకో?
రాష్ట్రం అప్పుల పాలైందని, కేసీఆర్ రాష్ర్టాన్ని దుబారా చేశారని పదేపదే అంటున్న సీఎం రేవంత్రెడ్డి, నమస్తే తెలంగాణ మినహా దేశంలోని అన్ని పత్రికలకు యాడ్స్ ఎందుకు ఇచ్చారని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. రేవంత్రెడ్డి మీడియా సమావేశంలో జర్నలిస్టులను అరే నాయనా.. అని సంబోధించటం ఏమిటని మండిపడ్డారు.