Dasoju Sravan | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉచిత కరెంట్ ఇచ్చామని కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని, అదంతా ఉత్త ముచ్చటేనని అప్పట్లో రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. అప్పట్లో తన తండ్రి చనిపోతే స్నానానికి నీళ్లు కూడా లేని దుస్థితి ఉన్నదని, నెత్తిమీద నీళ్లు చల్లుకుని మ.మ.. అనిపించామని స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను దాసోజు ట్వీట్ చేశారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉచిత కరెంట్ ఇచ్చామని జబ్బలు చరుచుకునే తెలంగాణ కాంగ్రెస్ నాయకులారా..? మీ ఉచిత విద్యుత్తు ఉత్తుత్తి ముచ్చటేనని ఇప్పటి మీ టీపీసీసీ అధ్యక్షుడే స్వయంగా అంగీకరించారు.
గతంలో తన తండ్రి చనిపోతే కరెంట్ లేక, నీళ్లు రాక తూతూ మంత్రంగా నీళ్లు చల్లుకొని బాధపడ్డట్లు తనకు తానే చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు తెలంగాణ ప్రజలను మోసం చేయడం తగదు. ఇవ్వాళ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు పుష్కలంగా అందుతున్నది. ప్రభుత్వం నిర్మించిన వైకుంఠధామాల్లో 24గంటల పాటు కరెంటు వస్తున్నది. నీళ్లు అందుబాటులో ఉన్నది నిజం కాదా? గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉచిత విద్యుత్ ఒక మోసం అని తెలిసిన తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు ఓటు వేయాల్నా? తన తాత ముత్తాతలంతా పటేల్ పట్వారీలుగా పని చేసినమని చెప్పుకున్న రేవంత్ రెడ్డి పరిస్థితే ఇంత ధీనంగా ఉంటే.. గత కాంగ్రెస్ హయాంలో సామాన్య ప్రజల కష్టాలు ఇంకెట్లుడేవో ఆలోచించండి’ అంటూ దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉచిత కరెంట్ ఇచ్చామని జబ్బలు చర్చుకునే @INCTelangana నాయకులారా, మీ ఉచిత విద్యుత్తు ఉత్తుత్తి ముచ్చటే ఉత్తదేనని ఇప్పటి మీ TPCC అధ్యక్షులు @revanth_anumula గతంలో తన తండ్రి గారు చనిపోతే కరెంట్ లేక నీళ్లు రాక తూతూ మంత్రంగా నీళ్లు చల్లుకొని బాధ పడ్డట్లు… pic.twitter.com/iNJlnyj52M
— Prof Dasoju Srravan (@sravandasoju) July 18, 2023