ఖైరతాబాద్, మార్చి 17: ‘ఒక పార్టీపై గెలిచి.. స్వార్థం కోసం మరో పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టిచంపాలి.. అలాంటి వారి కోసం ఉరితీసే చట్టాలు తీసుకురావాలని ప్రగల్భాలు పలికారు.. ఇప్పుడు మీ పార్టీలో చేరిన వారికి అదే శిక్షలు వేస్తారా’ అంటూ సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో గాంధీభవన్ సాక్షిగా మాట్లాడిన వ్యక్తి నేడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తన నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది పరమ ఛండాలమైన పనులు అన్న విధంగా సీఎం రేవంత్ వ్యవహారశైలి కనిపిస్తున్నదని చెప్పారు.
పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు చట్టాలకు లోబడి పార్టీలను విలీనం చేసి, బీఆర్ఎస్లో నాడు చిల్లర మాటలు మాట్లాడారని గుర్తుచేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, మరికొందరిని కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఏమనాలని ప్రశ్నించారు. నాడు రేవంత్రెడ్డి అన్న మాటల రికార్డులు డిజిటల్ మీడియాల్లో ఉన్నాయని, దానం నాగేందర్ పంజాగుట్టలో బీడీలు అమ్ముకున్నాడన్న ఆరోపణ నిజం కాదా? అని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల చెమట చుక్కలపై గెలిచి ఫిరాయించిన వారిని వదిలి పెట్టబోమని, రాజ్యాంగ, ప్రజాస్వామ్యబద్ధంగా వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. త్వరలోనే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ను కోర్టులో వేస్తామని, వారికి రాజకీయ సమాధి తప్పదని స్పష్టం చేశారు.
నాడు బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయంపై పలు ఆరోపణలు గుప్పించి, నేడు అదే పార్టీలోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తున్నావని ఎమ్మెల్యే దానం నాగేందర్ను శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. 2018 జూన్ 22న కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడి హోదాలో ఆ పార్టీకి ఇచ్చిన రాజీనామా లేఖలో అనేక విషయాలు ఉన్నాయని చెప్పారు. 50 శాతం బీసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ విస్మరించిందని, ఒకే ఒక్క సామాజికవర్గానికి ప్రాబల్యం, ప్రాతినిధ్యం కల్పించడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు అణిచివేతకు గురవుతున్నారని దానం ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు తన సామాజికవర్గాకే ప్రాధాన్యం ఇస్తానంటూ ప్రకటించాడని గుర్తు చేశారు.
అన్నట్టుగానే 50 శాతం టికెట్లు, 40 శాతం కార్పొరేషన్ సీట్లు ఆయన సామాజిక వర్గానికే ఇచ్చాడని విమర్శించారు. 119 నియోజకవర్గంలో బీసీలకు ఇచ్చిన వాటా ఎంత? అని ప్రశ్నించారు. ఇప్పుడు అదే పార్టీలోకి ఎలా వెళ్లావ ప్రశ్నించారు. దానం నాగేందర్ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు. తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని పదే పదే వ్యాఖ్యానిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ముందుగా ఆయన పార్టీని చూసుకోవాలని, ఇప్పటికే ఆ పార్టీలో ఎందరికో సీఎం కావాలన్న కోరికతో ఉన్నట్టు తెలుస్తున్నదని చెప్పారు. ఫిరాయింపులకు పాల్పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విప్లవ్కుమార్ ఉన్నారు.