హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులు ఫ్యూడల్ పోకడలు పోతున్నారని, ఆ పార్టీ సీనియర్లు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు రాష్ట్రంపై సోయే లేదని విమర్శించారు. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బీఆర్ఎస్ ద్వారా రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకోవచ్చో సీఎం కేసీఆర్కు అన్ని విధాలుగా తెలుసునని అన్నారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ఎన్నికల్లో ప్రతిపక్షాలు వారి మధ్య ఉన్న వైరుధ్యాల కంటే అధికార పార్టీపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. అందుకే సీఎం కేసీఆర్పై ఎక్కువగా దాడి చేస్తున్నారు. తెలంగాణకు, ప్రజలకు కనెక్టివిటీ ఉన్న వారే మంచి ఫలితాలు రాబట్టగలుగుతారు. తెలంగాణ ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతాం అనే విషయాన్ని కేసీఆర్ చెప్తున్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు ఫ్యూడల్ ప్రభువులుగా మిగిలిపోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పద్ధతి మార్చుకుంటే మంచిది. ఈ మధ్య కాలంలో పాత పద్ధతికి భిన్నంగా టికెట్ల పంపిణీలో డబ్బే ప్రధానంగా చూస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర నేతలకు తెలంగాణ అస్తిత్వంపై సోయి లేదు. కేంద్రం రాష్ర్టానికి ఏమీ చేయకపోయినా ప్రధాని మోదీ గురించి ఆహో ఓహో అనడం వారికి అలవాటైంది. ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా దక్కే విధంగా చూడాలి. కోట్లాడాలి. తెలంగాణ హక్కుల గురించి రాజీపడోద్దు. తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన నిధులు రాష్ర్టానికి రావడంలేదు. జీఎస్టీపై కేంద్రం లెక్కలు చెప్పాలి. రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో తెలంగాణకు, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది. ఇది సరియైనది కాదు.
దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన అవసరం ఉన్నది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కాంగ్రెస్ కులగణన చేపట్టాలని చెప్పింది. కుల గణనపై బీజేపీ ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటో చెప్పాలి. దీనిపై తెలంగాణ బీజేపీ బీసీ నాయకులు ఎందుకు మాట్లాడటంలేదు? బీజేపీ బీసీ నాయకులు ఆ పార్టీని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.
బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన మొదటి నుంచీ రాష్ట్రం సిద్ధించే వరకు సుదీర్ఘకాలం పార్టీలో పనిచేశాను. అప్పుడున్న పరిస్థితులు, ఈగో, తప్పుడు అంచనాలతో బయటికి వెళ్లాల్సి వచ్చింది. అయినా నేను ఏనాడూ సీఎం కేసీఆర్ను కానీ, బీఆర్ఎస్ను కానీ ఇరకాటంలో పెట్టే పరిస్థితి తేలేదు. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తారు. ఆయనపై ప్రజలకు విశ్వాసం ఉన్నది.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలితాలు బాగున్నాయి. మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి పెట్టారు. రోడ్ల విస్తరణ, బ్రిడ్జిల నిర్మాణం మంచి ఫలితాలు ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, మెడికల్ కాలేజీలపై డాక్టర్గా నాకున్న అనుభవంతో సలహాలు ఇస్తాను.
రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికలో భాగస్వామ్యం పంచుకుంటా. క్షేత్రస్థాయిలో పనిచేస్తా. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తా. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా ఆ పని చేస్తా.