హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ అరాచక పాలనకు చరమగీతం పాడే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాంసింగ్ చడూనీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం హర్యానాలోని వివిధ రంగాలకు చెందిన ముఖ్య నేతలతో ఆయన సమావేశమై మాట్లాడుతూ.. సకలజనుల సౌభాగ్యం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న పథకాలు దేశమంతా విస్తరించాలని ఆకాంక్షించారు.
హర్యానాలోని అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంజాబ్లో జిల్లా కన్వీనర్లు, తాలూ కా, గ్రామ కమిటీల నిర్మాణ ప్రక్రియ మొదలైందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ ఖూనీ చేస్తున్నదని దుయ్యబట్టారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పాలన సాగిస్తున్న మోదీ.. సామాన్యుల బతుకును ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లే అయినా కేసీఆర్ నాయత్వంలో దేశానికి మార్గదర్శనం చేసే స్థాయికి ఎదిగిందని కొనియాడారు. తెలంగాణను చూస్తే గుండె ఉప్పొంగిపోతున్నదని చెప్పారు.
తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్నాంసింగ్ కొనియాడారు. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా స్పందించే మానవీయ స్పర్శ ఉన్న నాయకుడు పాలకుడిగా ఉంటే అన్నివర్గాలు ధైర్యంగా ఉంటాయని పేర్కొన్నారు. అలాంటి అరుదైన నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. తెలంగాణలోని రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, దళితబంధు తదితర పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఇలాంటి మానవీయ పథకాలు బీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు.