హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై దురుద్దేశపూర్వకంగా అసత్య వార్తలు ప్రసారం చేసిన మహా టీవీకి బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు (Legal Notice) జారీ చేసింది. పార్టీ నాయకత్వంతో పాటు కేటీఆర్పై జర్నలిజం ముసుగులో మహా టీవీ (MAHAA TV)మేనేజ్మెంట్ వ్యక్తిగతంగా విషం చిమ్ముతుండడంతో నోటీసులు ఇచ్చినట్లు బీఆర్ఎస్ తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని రోజుల నుంచి తప్పుడు థంబ్ నేయిల్స్తో మహాటీవీ వార్తలు ప్రసారం చేస్తున్నది. ఈ విషయంలో పలుమార్లు పార్టీ విజ్ఞప్తి చేసినా చానల్ ఎడిటోరియల్ విధానంలో మార్పు రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి, నాయకులకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అసత్య కథనాలను ప్రసారం చేయడాన్ని మహాటీవీ ఆపలేదు. ఫేక్ న్యూస్లు, అసత్య ఆరోపణలను తమ యూట్యూబ్ చానెల్తో విస్తృతంగా ప్రచారం చేయడాన్ని కొనసాగించింది. ‘తమ్మినేని తమ్ముడు’ వంటి పాత్రలతో బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత దూషణలు, అవమానకరమైన కథనాలను మహా టీవీ ప్రసారం చేసింది. బీఆర్ఎస్ నాయకులపై గతంలో అభ్యంతరమైన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు, చట్టవ్యతిరేక ప్రసారాలు చేసిన యూట్యూబ్ చానెల్స్కు బీఆర్ఎస్ నోటీసులు ఇవ్వగా, కొన్నింటిలో కోర్టులు గట్టి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో బీఆర్ఎస్ వేసిన పరువు నష్టం దావా (రూ.100 కోట్లు) తో పాటు క్రిమినల్ డెఫమేషన్ కేసును విచారించిన కోర్టు ఆమెను మందలించింది. దీంతోపాటు ఎన్నికల సంఘం కూడా ఆమెకు హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపిన మహాటీవీ.. బీఆర్ఎస్ పైన, నేతల పైన అడ్డగోలుగా దుష్ప్రచారం చేయడం పట్ల స్పందిస్తూ లీగల్ నోటీసులు పంపినట్లు పార్టీ తెలిపింది. ఇప్పటికైనా మహాటీవీ తమ విధానాన్ని మార్చుకోకపోతే, కొండా సురేఖ కేసులో లాగే పరువు నష్టం దావా, క్రిమినల్ డెఫమేషన్ చర్యలు తీసుకోవడాన్ని పార్టీ తప్పనిసరిగా భావిస్తోంది. వార్తా సంస్థగా మహా టీవీ బాధ్యతగా వ్యవహరించాలని, జర్నలిజాన్ని వ్యక్తిగత ఎజెండాలకు వేదికగా కాక, సమాజ ప్రయోజనాల కోసం వాడాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది.