హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోటి దురద వల్లే రైతుబంధు ఆగిపోయిందని, అయినా మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక్కో సాకు చూపుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని ఊదరగొట్టారని, కానీ కేసీఆర్ బస్సుయాత్ర తర్వాత క్షేత్రస్థాయి లో పరిస్థితులు మారాయని చెప్పారు. సర్వే ఫలితాలు చూస్తే రేవంత్రెడ్డి, కిషన్రెడ్డిలకు దిమ్మతిరుగుతున్నదన్నారు. వాగ్దానాల వరద, నోటి దురద, అబద్ధాల బురద తప్ప రేవంత్రెడ్డి దగ్గర ఏమీ లేదంటూ ఎద్దేవాచేశారు. కేసీఆర్ బస్సు యాత్ర భయంతోనే రైతుబంధును మళ్లీ మొదలుపెట్టారని, తర్వాత ఈసీ ఆపాలని చెప్పిందని కుంటిసాకులు చెబుతున్నారని, రైతుబంధు విషయంలో బీఆర్ఎస్ ఎకడా ఫిర్యాదు చేయలేదని స్పష్టంచేశారు. రైతుల సంక్షేమం కోసమే బీఆర్ఎస్ పనిచేస్తున్నదని, పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు బీఆర్ఎస్ వైపే ఉంటారని చెప్పారు.
రాష్ట్రంలో మహిళలకు రూ.2500 ఇస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం చెల్లని చెకులాంటిదని దుయ్యబట్టారు. కేసీఆర్ సభలకు జనం పోటెత్తుతుంటే, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ సభలకు ఎవరూ రావడం లేదనే వారు మోదీ, అమిత్ షా, నడ్డాలను పిలిపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పదేండ్లలో రాష్ట్ర విభజన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పి బీజేపీ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో కేంద్రం చేపట్టిన రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఏండ్ల తరబడి అసంపూర్తిగానే ఉన్నాయని, కేటీఆర్ ఆధ్వర్యంలో 37 ఫ్లైఓవర్ బ్రిడ్జిలను బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటై బీఆర్ఎస్ను ఓడించాలని చూస్తున్నాయని, పార్లమెంటులో తెలంగాణ గొంతుక వినిపించేది బీఆర్ఎస్ ఒక్కటేనని, రాష్ట్రంలో బీఆర్ఎస్కు మాత్రమే క్యాడర్ ఉందని స్పష్టంచేశారు.