Puvvada Ajay | పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను బలంగా వినిపించడం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీనే ఎందుకు ఉండాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. పార్లమెంట్లో తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే బలం, గళం, దళమని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశం అనంతరం పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నామా నాగేశ్వరరావు తెలంగాణ బలాన్ని, గళాన్ని వినిపించిన వ్యక్తి అని, అందుకే.. మళ్లీ ఆయన్నే ఖమ్మం ఎంపీగా నిలబెట్టాలని పార్టీ అధ్యక్షుడిని కోరామని తెలిపారు.
తెలంగాణలో బీఆర్ఎస్కు పునర్వైభవం వస్తుందని పువ్వాడ అజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిసారి ఒకే ఎమ్మెల్యే స్థానంలో పార్టీ గెలిచిందని గుర్తు చేశారు. కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మంచి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారని తెలిపారు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే జరగబోతుందని, నామా నాగేశ్వరరావు మంచి మెజార్టీతో మళ్లీ గెలవబోతున్నారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. కేసీఆర్, కేటీఆర్ పార్టీ కేడర్ను కాపాడుకుంటారని తెలిపారు. పోరాటంలో నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, ఆ ఉద్యమ స్ఫూర్తి అధినేత కేసీఆర్ నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకూ ఉన్నదన్నారు. త్వరలోనే కేసీఆర్ లేదా మరే ఇతర నాయకుడి నేతృత్వంలో అసెంబ్లీల వారీగా నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ హామీలను ప్రజలు బలంగా నమ్మారని, ఇప్పుడు ఆ హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.