బీఆర్ఎస్ బల(గ)ం కార్యకర్తలే. 60 లక్షల మంది క్రమశిక్షణ కలిగిన సైన్యమే పార్టీకి కొండంత అండ. నాలుగు కోట్ల మంది ‘స్వరాష్ట్ర’ ఆకాంక్షను నెరవేర్చేందుకు కేసీఆర్ చేసిన ఉద్యమంలో ముందుండి పోరాడిన వీరులు కార్యకర్తలు. దశాబ్దాల చరిత్ర అంటూ జబ్బలు చరుచుకొన్న పార్టీలను పొలిమేర దాటించిన అసామాన్యులు. పార్టీ సాధించిన అనితరసాధ్యమైన విజయాలకు రథసారథులు. అలాంటి కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకోవటంలో పార్టీ అధినేతగా సీఎం కేసీఆర్ మిగతా రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షలు సాయమందేలా చేసి అండగా నిలుస్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఓ వైపు పార్టీ కోసం, మరోవైపు ప్రజా ప్రయోజనం కోసం ఎండనకా, వాననకా కృషి చేస్తున్న కార్యకర్తలకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. వారి కుటుంబం రోడ్డున పడకుండా అండగా నిలువాలని సీఎం కేసీఆర్ భావించారు. 2015లో పార్టీ కార్యకర్తలందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. సభ్యత్వం (సాధారణ, క్రియాశీల) ఉన్న పార్టీ కార్యకర్తల కోసం రూ. 100 కోట్లను ఇన్సూరెన్స్ ప్రీమీయం రూపంలో చెల్లించారు. ఇప్పటివరరూ 5,141 మంది ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ప్రమాదబీమా వర్తింపజేసి, ఆ కుటుంబాలకు అండగా నిలిచారు. ‘తల్లికోడి తన పిల్లలను కాపాడుకొన్నట్టే నేనూ మిమ్మల్ని కాపాడుకుంటా’ అని చెప్పడమే కాదు.. చేసి నిరూపిస్తున్నారు సీఎం కేసీఆర్.
పార్టీ కార్యకర్త ప్రమాదంలో మృతిచెందితే అతడి కుటుంబ సభ్యులు నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధి ద్వారా లేదా స్వయంగా వచ్చి బీమా క్లెయిమ్కు దరఖాచేసుకొనేందుకు వీలుగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడికి వచ్చే ప్రతీ కార్యకర్త కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించేందుకు రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. వచ్చిన వారందరినీ కూర్చోబెట్టి వారి పూర్తి వివరాలను తీసుకొంటారు. ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి క్లెయిమ్స్ సకాలంలో వచ్చేలా చూస్తారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారికి ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొన్న ప్రతీ కార్యకర్త (సాధారణ లేదా క్రియాశీల సభ్యత్వం) రూ.2 లక్షల ప్రమాద బీమాకు అర్హులేనని పార్టీ ఇన్సూరెన్స్ విభాగం పేర్కొన్నది. అయితే సహజ మరణాలు, గుండెపోటు మరణాలవంటివి బీమా పరిధిలోకి రావని స్పష్టం చేసింది. 69 ఏండ్లలోపు ఉండి.. రోడ్డు ప్రమాదం, విద్యుదాఘాతం, పాముకాటు, ప్రమాదంలో కాలిన గాయాలు, ఏదైనా ఎత్తు నుంచి కింది పడి, పిడుగుపాటు, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి, రైలు ప్రమాదాల్లో మరణించిన వారికి బీమా వర్తిస్తుంది. సహజమరణాలు, గుండెపోటుతోపాటు వడదెబ్బ, ఆత్మహత్య, హత్య, మద్యం, అనారోగ్యంపాలై మృతిచెందినవారికి బీమా వర్తించదు.
ప్రమాదంలో కార్యకర్త మరణించిన 60 రోజుల గడువులోగా కుటుంబ సభ్యులు తెలంగాణ భవన్లో నిర్దేశిత పత్రాలు సమర్పించాలి. గడువు దాటిన తర్వాత బీమా కంపెనీలు క్లెయిమ్స్ను పరిగణనలోకి తీసుకోబోవని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీఆర్ఎస్ సభ్యత్వ రశీదు కలర్ జిరాక్స్, మరణ ధ్రువీకరణ పత్రం, ఎఫ్ఐఆర్, పంచనామా కాపీ, పోస్ట్మార్టం కాపీ (అధికారుల అటెస్టేషన్తో), రేషన్కార్డు జిరాక్స్, న్యూస్పేపర్ కాపీ జిరాక్స్ (ఒకవేళ ఏ పత్రికలో అయినా ప్రచురితమైతే), సభ్యుడు, నామినీ ఆధార్కార్డుల జిరాక్స్, నామినీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, సభ్యుడు, నామినీ మూడు పాస్పోర్ట్సైజ్ ఫొటోలను తెలంగాణ భవన్లోని ఇన్సూరెన్స్ విభాగానికి నేరుగా కానీ లేదా ఇతరుల ద్వారా నిర్దేశిత గడువులోగా అందించాలి.
2015-16 నుంచి 2022-23 వరకు వివిధ ప్రమాదాల్లో మరణించిన 5,141 మంది పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలకు క్లెయిమ్స్ సమర్పించారు. అందులో 4,636 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పన ఆర్థిక సహాయం అందింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 186 క్లెయిమ్స్ తిరస్కారానికి గురికాగా, 319 క్లెయిమ్స్ వివిధ దశల్లో ఉన్నాయి.
‘తల్లికోడి తన పిల్లలను కాపాడుకున్నట్టే నేను మిమ్మల్ని కాపాడుకుంటా. మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా. మీరు లేకపోతే నేను లేను. మీరు లేకపోతే తెలంగాణ లేదు. మీరే నా బలం. బలగం. నన్ను నడిపించే శక్తి మీరే. ఊరూరా కథానాయకులై కదిలారు. పార్టీకోసం కష్టపడ్డారు. రాష్ట్రం కోసం పరితపించారు. అటువంటి మీకు నేను ఏమిచ్చినా రుణం తీరదు.
-బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్
‘కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన పార్టీ కుటుంబీకులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేమందరం మీకున్నం. మనందరిదీ 60 లక్షల మంది కుటుంబం. మనందరికీ పెద్దిదిక్కుగా సీఎం కేసీఆర్ ఉన్నరు. అందరినీ ఆయనే ఆదుకుంటరు. నిబ్బరం గా.. మనోధైర్యంగా ఉండాలి. మీకే సమస్య ఉన్నా మన పార్టీ చూసుకుంటది’.
-మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, (తెలంగాణ భవన్లో ఆగస్టు 4, 2021న ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులతో)
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గంగానగర్కు చెందిన సూత్రాల రమేశ్, అతడి భార్య కళావతి బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తండ్రీకొడుకులు కులవృత్తి చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నిరుడు జూన్లో కళావతి దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఆ పుట్టెడు దుఃఖంలో ఉన్న రమేశ్ కుటుంబం ఇంట్లో శుభకార్యం జరగాలని తలచి కుమార్తె అనూషకు ఈ ఏడాది మార్చి 10న వివాహం జరిపించారు. అంతలోనే పార్టీ నుంచి బీమా కింద రూ.2 లక్షలు వచ్చినయ్. బిడ్డ పెండ్లి చేసి బంగారం ఎట్ల పెట్టాలె అని బాధపడుతున్న రమేశ్కు పార్టీ నుంచి వచ్చిన డబ్బులు ఆసరైనయ్. ఆ పైసలతోనే బంగారంతోపాటు మరికొన్ని సామాన్లు కొనుగోలు చేసి బిడ్డకు ఇచ్చిండు. కూతురును ఆనందంగా అత్తారింటికి సాగనంపిండు. పార్టీని నమ్ముకున్నందుకు నాకు మేలు జరిగిందని రమేశ్ అంటున్నడు.
– సూత్రాల రమేశ్, గంగానగర్, గోదావరిఖని (కోల్సిటీ)
మాది రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ముస్తాఫానగర్. నా భర్త అనంత రమేశ్ 15 ఏండ్లపాటు దుబాయ్ పోయిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఇంటికి వచ్చి హమాలీ పని చేసుకుంటూ ఇక్కడే ఉన్నడు. బీఆర్ఎస్ల చేరి పార్టీ మీటింగులకు పోతుండె. 2018 జనవరి 17న రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. నాకు కూతురు శైలజ, కొడుకు రాకేశ్ ఉన్నారు. కూతురుకు పెళ్లి సంబంధం చూస్తున్న టైంల నా భర్త చనిపోవడంతో చేతిలో పైసలు లేక ఆగమాగం అయిన. బిడ్డ పెండ్లి ఎట్లాజేయాలె అని రందివడ్డ. ఆ టైంలనే రమేశ్కు బీఆర్ఎస్ సభ్యత్వం ఉందని, పార్టీనుంచి రూ. రెండు లక్షలు వస్తాయని స్థానిక నాయకులు చెప్పిండ్రు. దీంతో నాకు ధైర్నమచ్చింది. అప్పుడు సంబంధం చూసి బిడ్డ పెండ్లి జేసిన. బిడ్డ పెండ్లికి మొత్తం నాలుగు లక్షల వరకు ఖర్సయింది. కొండూరి రవీందర్రావుసారు మా ఇంటికి వచ్చి పార్టీ బీమా కింద రెండు లక్షల రూపాయల చెక్కును నా చేతికిచ్చిండు. రెండు లక్షలతో పెండ్లి అప్పు తీర్చిన.
– అనంత లక్ష్మి, ముస్తాఫానగర్. గంభీరావు పేట (రాజన్న సిరిసిల్ల)