పెద్దపల్లి, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ(Loan waiver) చేయాల్సిందేనని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(koppula Eshwar) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గెలిచేదాకా అనేక హామీలు ఇచ్చి, రైతు భరోసా అంటూ మాయమాటలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ రైతులను నిట్ట నిలువునా మోసం చేసిముంచే సిందన్నారు.
అనేక కొర్రీలు పెట్టి రుణమాఫీకి ఎగనామం పెట్టిందన్నారు. రూ.2లక్షల లోపు రైతు రుణాలన్నీ మాఫీ చేయాలని, రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి జియో పెట్రోల్ బంక్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం దాకా భారీ ర్యాలీ తీశారు. అనంతరం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జల్ద అరుణశ్రీకి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ఇక మీ ఆటలు సాగవు.. తొమ్మిది నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరాచకాలను ప్రజలు చూశారు. తెల్లవారితే ఏం జరుగుతుంతో తెలియని భయానక వాతాతవరణంలో హైదరాబాద్ ప్రజలు బతుకున్నారు. రేవంత్రెడ్డి అస్థవ్యస్త పాలనపై విసిగి చెంది జనం తిరబడేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఇదీ అంతం కాదు.. ఇప్పుడే ఆరంభమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ అయ్యే దాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.