KTR | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం రాష్ట్ర సంపదను భారీగా పెంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారక రామారావు స్పష్టం చేశారు. గత తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3,17,015 కోట్ల అప్పు చేసిందని, అదే సమయంలో దాదాపు రూ.50 లక్షల కోట్ల సంపదను సృష్టించిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ‘స్వేదపత్రం’ పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం తెచ్చిన అప్పులతో పోలిస్తే దాదాపు 16 రెట్లు అధికంగా ఆస్తుల కల్పన జరిగిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం భారీగా అప్పులు తెచ్చినట్టు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గత తొమ్మిదిన్నర ఏండ్లలో తెలంగాణ రూ.6,71,757 కోట్లు అప్పు తెచ్చిందంటూ అంకెల గారడీలు, అభాండాలతో రేవంత్ సర్కారు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ప్రస్తుతం ఎఫ్ఆర్బీఎం పరిధిలోని రాష్ట్ర అప్పులను రూ.3,89,673 కోట్లుగా, అందులో 2013-14 నాటికి ఉన్న అప్పులను రూ.72,658 కోట్లుగా ఇటీవల అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొన్నదని కేటీఆర్ తెలిపారు. ఈ లెక్క ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,17,015 కోట్లు మాత్రమేనని వివరించారు. ఈ వాస్తవాన్ని కప్పిపు రేవంత్ సర్కారు కప్పిపుచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు దివాలాకోరు ప్రయత్నాలు చేస్తున్నదని నిప్పులు చెరిగారు.
ఎన్నో ఆస్తులను సృష్టించాం
రాష్ట్రంలో వ్యవసాయ, విద్యుత్తు, నీటిపారుదల రంగాల అభివృద్ధికి గత తొమ్మిదన్నర ఏండ్లలో ఎంతో కృషి చేశామని, విద్యుత్తు రంగంలో రూ.1,37,517 కోట్లు ఖర్చు చేసి.. రూ.6,87,585 కోట్ల విలువైన ఆస్తులను సృష్టించామని కేటీఆర్ వివరించారు. సాగు విస్తీర్ణాన్ని 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.68 కోట్ల ఎకరాలకు వరిధాన్యం ఉత్పత్తిని 68 లక్షల టన్నుల నుంచి 350 లక్షల టన్నులకు పెంచామని తెలిపారు. ఐదు విప్లవాలతో ఎన్నో అద్భుతాలు సాధించామని చెప్పారు. శ్వేతవిప్లవంతో పాల ఉత్పత్తిని 4.2 నుంచి 5.8 మిలియన్ టన్నులకు పెంచామని పేర్కొన్నారు. గులాబీ విప్లవంతో గొర్రెల సంఖ్య 12.8 నుంచి 19.1 మిలియన్లకు పెరిగిందని, నీలి విప్లవంతో చేపల ఉత్పత్తిని 2.68 నుంచి 3.90 లక్షల టన్నులకు పెంచడం ద్వారా దాదాపు రూ.30 వేల కోట్ల సంపదను సృష్టించామని తెలిపారు. పసుపు విప్లవంతో ఆయిల్పామ్ సాగును 27,376 ఎకరాల నుంచి 20 లక్షల ఎకరాలకు పెంచామని చెప్పారు. వీటితోపాటు గ్రామాల అభివృద్ధి, భూగర్భ జలాలను పెంచడం, సాగునీటి వసతులను మెరుగుపర్చడంతో భూముల విలువ ఎన్నోరెట్లు పెరిగిందని వివరించారు. రాష్ట్రంలో 1.52 కోట్ల ఎకరాల పట్టా భూములకు రైతుబంధు ఇవ్వడంతో ఆ భూముల విలువ ఎన్నో రెట్లు పెరిగిందని తెలిపారు. తెలంగాణలో పెరిగిన సంపదను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తే.. రాష్ట్ర భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉంటుందని హితబోధ చేశారు.
తొమ్మిదిన్నర ఏండ్లలో అగ్రస్థానంలో ఆర్థిక ప్రగతి
తెలంగాణ అతి తక్కువ సమయంలోనే సుసంపన్న రాష్ట్రంగా అవతరించిందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఛిన్నాభిన్నంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక రంగం పరిపుష్ఠమైతేనే ఉద్యమ నినాదమైన ‘నిధులు, నీళ్లు, నియామకాలు’ సాకారమవుతాయని భావించామని, అందుకే తెలంగాణ ఆదాయ వనరులను మెరుగుపరిచేందుకు ప్రముఖ ఆర్థికవేత్త జీఆర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించి పటిష్ఠ ఆర్థిక ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకుసాగి ఎన్నో అద్భుతాలు సాధించామని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.1,12,162గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని తొమ్మిదిన్నర ఏండ్లలో రూ.3,17,115కు పెంచామని, ఇదే సమయంలో జీఎస్డీపీని రూ.4.51 లక్షల కోట్ల నుంచి రూ.13.27 లక్షల కోట్లకు పెంచగలిగామని గుర్తు చేశారు. ఈ వాస్తవాలను కాంగ్రెస్ ప్రభుత్వం కప్పిపుచ్చి రాష్ట్రం అప్పుల పాలైనట్టు అసత్య ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అస్థిత్వాన్ని, ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసే కుట్ర
బీఆర్ఎస్పై అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా అసత్యాలను ప్రచారం చేస్తున్నదని, తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపేందుకు విఫలయత్నం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. అందులో భాగంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలతోపాటు గ్యారంటీ ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి స్థూలంగా ఉన్న రుణాలు రూ.3,17,051 కోట్లు మాత్రమేనని, దీనికి విరుద్ధంగా రేవంత్ సర్కారు లేని అప్పును ఉన్నట్టు చూపి తిమ్మిని బమ్మిని చేస్తున్నదని ధ్వజమెత్తారు. బడ్జెట్ రుణాలతోపాటు స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) కింద తీసుకున్న రుణాలను సైతం ప్రభుత్వ అప్పుగానే చూపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఉదాహరణకు.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల లాంటి వాటిని నిర్మించాలంటే ప్రభుత్వ గ్యారెంటీలతో సంబంధం లేకుండానే రుణాలు ఇస్తారని, ఆ తర్వాత ఆ సంస్థలే ఆ అప్పులను తీర్చేస్తాయని చెప్పారు.
ఇలా రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లు, సంస్థలు ఉన్నాయని, ఎస్పీవీ ద్వారా అవి తెచ్చుకున్న రూ.95,462 కోట్ల రుణాలను ప్రభుత్వ అప్పులుగా చూపడం సరికాదని పేర్కొన్నారు. సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ అప్పు రూ.21,029 వేల కోట్లు మాత్రమే ఉన్నదని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ శ్వేతపత్రంలో దీనికి అదనంగా రూ.35 వేల కోట్లు జోడించి రూ.56,146 కోట్లుగా చూపారని చెప్పారు. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణను దేశంలో ఏ రాష్ర్టానికీ అందనంత ఎత్తులో నిలిపారని, ఈ నిజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెట్టి తెలంగాణను దివాళాకోరు రాష్ట్రంగా చిత్రీకకరించే ప్రయత్నం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. ఎవరెన్ని అభూత కల్పనలు సృష్టించినా, ఎన్ని సత్యాలను దాచేసి అసత్యాలను ప్రచారం చేసినా.. గత తొమ్మిదిన్నర ఏండ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.50 లక్షల కోట్ల సంపదను సృష్టించిందనేది అక్షర సత్యమని, ప్రజల ముందు కనిపిస్తున్న నిజమని కేటీఆర్ స్పష్టం చేశారు.
బడ్జెట్ రుణాలు