భీమ్గల్/ధర్పల్లి, జూలై 14: ఇటీవల చిరుతలను వేటాడి చంపిన కేసు ఎన్నో మలుపులు తిరుగుతున్నది. భీమ్గల్, ధర్పల్లి ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడిన వారిని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల వద్ద నాటు తుపాకులు లభ్యం కావడంతో అటవీ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. పాతికేండ్ల క్రితం నక్సలైట్లు, అనంతరం మావోయిస్టులు, పోలీసుల తుపాకీ తుటాల మోతలు భారీ ఎన్కౌంటర్లతో అట్టుడికి, దశాబ్ద కాలంగా ప్రశాంతంగా ఉంటున్న భీమ్గల్ అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో మళ్లీ అలజడి మొదలైంది. చిరుత మృతి కేసులో అటవీ అధికారులు, పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్లు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల భీమ్గల్ మండలం తాళ్లపల్లి గ్రామంలో ఓ పశువుల కాపరీకి చెందిన గొర్రెను చిరుతపులి వేటాడి చంపినట్లు తెలిసింది. దీంతో ఆ పశువుల కాపరి మళ్లీ తన గొర్రెల మందపై చిరుత దాడి చేస్తుందని భావించి చనిపోయిన గొర్రెపై విషం పూసి చిరుతను హతమార్చి, అడవిలో పాతి పెట్టినట్లు సమాచారం. కొందరు స్మగ్లరు చిరుత చర్మం, గోర్లు అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశ చూపి, దాన్ని వెలికి తీసి విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయం తనిఖీల్లో పట్టుబడిన స్మగ్లర్లను విచారించగా మొత్తం ముఠా వివరాలు బయటపడ్డాయి.
దీంతో గొర్రెల కాపరికి సహకరించి వేటగాళ్లను పోలీసులు విచారించగా, పలువురి వద్ద నాటు తుపాకులు లభ్యమైనట్లు తెలిసింది. నాలుగు రోజులుగా పోలీసులు మండలంలోని తాళ్లపల్లి, దేవక్కపేట్, కారేపల్లి తదితర గ్రామాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతపై విషప్రయోగానికి గొర్రెల కాపరికి సహకరించిన దేవక్కపేట్కు చెందిన ఒక ఆర్ఎంపీతో సహా సుమారు పది మంది వరకు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తాళ్లపల్లిలో కూడా ఆరేడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ కేసును అటవీశాఖ కన్నా పోలీసు శాఖనే సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ధర్పల్లిలో గోర్లు, దంతాలు స్వాధీనం
ధర్పల్లి ప్రాంతంలో చిరుత మృతి కేసులో అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నిందితులతో కలిసి ధర్పల్లికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఇందల్వాయి అటవీ రేంజ్ అధికారి రవిమోహన్ భట్ ఆధ్వర్యంలో రెండు బావుల వద్ద విచారణ చేపట్టారు. వేటగాళ్లు చిరుతను చంపి దాచుకున్న తొమ్మిది గోర్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రామారెడ్డికి చెందిన మరో నిందితుడు పరారీలో ఉండగా అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.