BRS | రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. రాష్ట్ర అప్పులపై శాసన సభను, ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. తెలంగాణ అప్పులు కేవలం రూ.3.89 లక్షల కోట్లు అని ఆర్బీఐ తన నివేదికలో స్పష్టం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ.7లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటూ తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు. అందుకే సభాహక్కుల నోటీసు ఇస్తున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ఇటీవల “హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్” పేరిట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక నిరూపించిందని స్పీకర్ దృష్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూ. 3,89, 673 కోట్లకు చేరిందని ఆర్బీఐ వెల్లడించిందని తెలిపారు.
రాష్ట్ర అప్పులపై ఆర్ధిక మంత్రి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని తెలిపారు. కావున తెలంగాణ శాసనసభ కార్య విధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామని తమ పిటిషన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరించారు.