యాదాద్రి భువనగిరి, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన బీఆర్ఎస్ కమిటీ నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నది. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడడగా క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించనున్నది. బాధిత కుటుంబాలతో మాట్లాడి భరోసా ఇవ్వనున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులకు మళ్లీ పదేండ్ల కిందటి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. కాలువల ద్వారా సాగునీరు రాక, ఎండుతున్న చెరువులు, బావులతో పంటలను కాపాడుకోలేక.. పెట్టుబడి సాయం అందక, రుణమాఫీ కాక అప్పుల బాధలతో మళ్లీ రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 18 మంది, యాదాద్రి భువనగిరిలో ఐదుగురు, సూర్యాపేటలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్యలకు గల కారణాలను రాజకీయ నిపుణులు, రైతు సంఘాల నేతలు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా యాసంగిలో రైతు భరోసా ఎగవేత, సకాలంలో పెట్టుబడి సాయం అందించకపోవడం, అరకొరగా రుణమాఫీ, గతంలో మాదిరి యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు కాళేశ్వరం జలాలు అందకపోవడం, నాగార్జునసాగర్ ఆయకట్టులో నీటి విడుదల లేకపోవడం, కరెంట్ కష్టాలు, ధాన్యం కొనుగోళ్లలో సర్కారు విఫలం తదితర అనేక కారణాలతో రైతులు ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. నల్లగొండ జిల్లాలో మంగళవారం బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ పర్యటించనున్నది. పట్టణంలో జరిగే మహాధర్నాలోనూ పాల్గొననున్నది. అక్కడే రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి భరోసా ఇవ్వనున్నది. అనంతరం వివిధ ప్రాంతాల్లో రైతుల కుటుంబాలను పరామర్శించనున్నది. కర్షకుల ఆత్మహత్యలకు గల కారణాలపై అధ్యయనం చేయనున్నది. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పనున్నది.